ఆర్కే చెప్పిన టాప్ సీక్రెట్: బాబు బాటలో నడుస్తానన్న వైఎస్ఆర్..?
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే.. రాజకీయంగా వైఎస్సార్ చంద్రబాబు ఇద్దరి మధ్యా తీవ్రమైన విబేధాలు ఉన్నా.. వైఎస్ మాత్రం చంద్రబాబు విధానాల పట్ల చాలా సానుకూలంగా ఉండేవారని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చెబుతున్నారు. మొన్న అసెంబ్లీలో తన భార్యను అవమానించారంటూ చంద్రబాబు ప్రెస్ మీట్లో విలపించిన ఘటన గురించి తన పత్రికలో ఎడిటోరియల్ రాసిన రాధాకృష్ణ.. చంద్రబాబు పరిపాలన విధానాల పట్ల అప్పట్లో వైఎస్ వంటి వారు కూడా సానుకూలంగా ఉన్నారని.. మెచ్చుకున్నారని చెబుతున్నారు.
చంద్రబాబు రాజకీయాలతో ఎవరైనా విభేదించవచ్చు గానీ సీఎంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను గానీ, విభజిత ఆంధ్ర ప్రదేశ్ను గానీ ఆయన తలెత్తుకునేలానే చేశారని ఆర్కే చెబుతున్నారు. చంద్రబాబుకు ఆంగ్లభాషపై పట్టు లేకపోయినా అంతర్జాతీయ నాయకులను, కంపెనీలను రాష్ర్టానికి రప్పించారని గుర్తు చేస్తున్నారు ఆర్కే. పరిపాలన అనే పెద్ద పెద్ద విషయాల గురించి తెలియని వాళ్లు చంద్రబాబును అవహేళన చేయవచ్చని... కానీ.. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి వంటి వారు సైతం ఆంతరంగిక సంభాషణల్లో ఆయన పనితీరును మెచ్చుకున్నారని అంటున్నారు ఆర్కే.
ఇందుకు ఉదాహరణగా ఆయన ఓ సంఘటనను ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆయనను ఓ పారిశ్రామికవేత్త కలిశారట. ఆయన.. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం రాష్ర్టానికి అవసరం అన్నారట. అప్పుడు వైఎస్.. చంద్రబాబును కించపరచవద్దని హితవు పలికారట. చంద్రబాబు విజన్ ఆచరణీయమని.. చంద్రబాబు మొదలుపెట్టిన అన్ని కార్యక్రమాలను నేను పూర్తి చేస్తానని వైఎస్ అన్నట్టు ఆర్కే రాసుకొచ్చారు.