తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉంటాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బహిరంగాగానే విమర్శలు చేసుకోవడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. ఎప్పటి నుంచో ఈ తంతు కొనసాగుతోంది. సీనియారిటి బట్టి తమకు టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి కావాలని ఆశించిన వారు చాలా మందే ఉన్నారు. కానీ, సమర్థవంతంగా పార్టీ నడుపుతామని, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఎవరూ కూడా ముందుకు రాలేదు. ఆ తరువాత టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ని అధిష్టానం నియమించడంతో పార్టీలోని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్లను వదిలేసి మొన్న మొన్న వచ్చిన జూనియర్కు ఎలా ఇస్తారని కూడా వాదించారు.
అయితే, ఎట్టకేలకు రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో పార్టీలోని కొందరు రేవంత్కు వ్యతిరేకంగా గళం వినిపించడం మొదలు పెట్టారు. అయినా రేవంత్ మాత్రం వాళ్లను కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. స్వయంగా సీనియర్ల ఇంటికి వెళ్లి వాళ్లను కలిసి మాట్లాడారు. అయినా, రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు కొందరు సీనియర్ నాయకులు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. సమయం దొరికనప్పుడల్లా రేవంత్ రెడ్డికి వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. చివరికి పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, సీనియర్ నాయకుల ద్వారా ఈ గొడవ సద్దు మణిగింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీలో సింగిల్ హీరోయిజం పనికి రాదని రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హీరోలుగా చిరంజీవి, రజినీకాంత్ ఉన్నారని ఎద్దేవా చేశారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ సీరియస్ అయింది. దీంతో రంగంలోకి దిగిన మాణిక్కం ఠాగూర్, సీనియర్ నాయకులు జగ్గారెడ్డికి తో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి తప్పయింది అని చెప్పి సారి చెప్పారు. కానీ, కొందరు సీనియర్లు మాత్రం జగ్గారెడ్డి కరెక్ట్ మాట్లాడారు.. సారి చెప్పాల్సిన అవసరం లేదంటున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.