ఆహా !: ఎన్నాళ్లకు జనంలోకి జగన్ ?
వాస్తవానికి పాలనపై రెండున్నరేళ్లయినా పట్టు లేని జగన్ ఇప్పుడు సచివా లయాల్లో తెచ్చే మార్పు ఏంటన్నది ఆసక్తిదాయకం అంతేకాదు అవసరం కూడా!
లైఫ్ లో ఈ పాటి ఆహా ఉండాల్సిందే అని అల్లూ అర్జున్ చెప్పాడు. అవును! మాక్కూడా ఆహా ! అనిపించుకునే సందర్భాలు కొన్నే అయినా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే జగన్ చాలా రోజులకు బయటకు వస్తున్నాడు. డిసెంబర్ నుంచి క్షేత్ర స్థాయిలో తన పాలన ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆరాటంలో భాగంగా బయటకు వస్తున్నాడు. ఓ విధంగా తన పంజరం నుంచి స్వేచ్ఛ కోరుకుని వస్తున్నాడా..లేదా అధికారులు, నిఘా వర్గాలు తనను తప్పుదోవ పట్టిస్తున్నారని భావించి వస్తున్నాడా? ఏదైతేనేం డిసెంబర్ నుంచి సచివాలయాల సందర్శన తప్పనిసరి అని ఆయన అంటున్నారు. అలానే ఎమ్మెల్యేలు కూడా నెలకు నాలుగు సార్లు గ్రామ సచివాలయాలు సందర్శించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం వచ్చే నెల నుంచి అమలు కానుంది.
వాస్తవానికి జగన్ సీఎం అయ్యాక అస్సలు బయటకు వచ్చిన దాఖలాలే లేవు. కరోనా ఒకటి, రెండు దశల కారణంగా కొంత, తరువాత సచివాలయంలో రేగిన కలకలం కొంత అన్నీ కలిసి పాపం ఆయనను బయటకు రానివ్వడం లేదు. ముఖ్యంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని ఆయన కలలు కన్నారు. కానీ అది కూడా కాలేదు. తన పాలనపై జనంలో అసంతృప్తి పెరిగిపోతున్నందున జగన్ బయటకు వస్తున్నారా? లేదా నిజంగానే క్షేత్ర స్థాయి సమస్యలు పరిష్కరించబోతున్నారా? గతంలో మాదిరిగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కానీ ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క ఆకస్మిక తనిఖీ చేయలేదు. కనీసం ఆర్టీసీ బస్టాండ్లకు పోయి అక్కడి వాతావరణం, పరిస్థితులపైనా వివరాలు తెలుసుకోలేదు. ఇవన్నీ ఎందుకు ఓ పీహెచ్సీని కానీ లేదా మరో ప్రభుత్వ ఆస్పత్రిని కానీ వారు సందర్శించిన దాఖలాలే లేవు. ఇప్పుడు సడెన్ జగన్ బయటకు వస్తే బాధ్యులపై సరిగా పనిచేయని వారిపై ఏమయినా చర్యలుంటాయా? వాస్తవానికి పాలనపై రెండున్నరేళ్లయినా పట్టు లేని జగన్ ఇప్పుడు సచివా లయాల్లో తెచ్చే మార్పు ఏంటన్నది ఆసక్తిదాయకం అంతేకాదు అవసరం కూడా!