అన్ని పక్షాలే .. అక్కడ ప్రభుత్వం ..
ప్రజాక్షేత్రంలో ఏ పార్టీ అయినప్పటికీ అనుకూలమైన నిర్ణయాలు తీసుకోలేకపోతే అధికారం కూడా ఎక్కువ కాలం ఉండదు. అంటే అధికారం వచ్చేసింది కదా అని అహంకరించి ప్రవర్తిస్తే, విపక్షాలు పక్కలో బల్లెం మాదిరి విమర్శించడానికి సిద్ధంగా ఉంటాయన్నది స్పష్టమైన నిజం. అయితే సేవ చేసేవారు ఎక్కడ ఉన్నా చేస్తూనే ఉంటారు, చేయని వాడు ఎక్కడ ఉన్నా ప్రయోజనం శూన్యం. అందుకే ఎన్నికలలో అధికారం రాగానే అంతా అయిపోయింది అనుకోవడం రాజకీయాలలో సాధ్యం కానిపని. అందుకే చరిత్రలో దీనికి తగ్గ ఉదాహరణలు కూడా లేకపోలేదు, అధికారంలోకి వచ్చి, అహంకరించిన పార్టీలను విపక్షాలు వెంటనే దించిన దాఖలు కూడా ఉన్నాయి. ఇలా గోతికాడ నక్కలా ఉండే ఆయా పార్టీలను తట్టుకొని ఎప్పటి కప్పుడు ప్రజలకు సేవ చేయడానికి సంసిద్ధంగా ఉండాలి అంటే అంత సులభం కాదు.
అయితే చరిత్రలో కూడా ఎన్నో అరుదైన రాజకీయ సమీకరణాలు లేకపోలేదు. అలాంటిదే తాజాగా నాగాలాండ్ లో ఏర్పడిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏ ఒక్క పార్టీతో ఏర్పాటు చేసింది కాదు, ఇక్కడ అధికారవిపక్షాలు రెండు లేవు, వీరందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే దీని గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చింది. నాగాలాండ్ చరిత్రలో ఇదో మైలు రాయి. తాజాగా ఇక్కడ అధికారపక్షంతో విపక్షాలు అన్ని చేతులు కలిపాయి. ఈ చారిత్రిక విషయానికి యునైటెడ్ డెమోక్రాటిక్ అలయన్స్ అని పేరు పెట్టారు. రాజధాని కోహిమాలో ఎండిపిపి, ఎన్పిఎఫ్, బీజేపీ స్వతంత్రులతో పాటుగా ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. నాగాలాండ్ ముఖ్యమంత్రి రియో అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని పక్షాలు ఒకేతాటిపైకి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. 2018లో బీజేపీ, ఎండిపిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఎన్పిఎఫ్ ప్రతిపక్షంగా ఉంది. తాజాగా ఈ ప్రతిపక్షం కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది.