సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంటి ముందు ఆడుతున్న చిన్నారిని చాక్లెట్ ఆశ చూపి తీసుకెళ్లిన దుర్మార్గుడు అత్యాచారం చేసి ఆ తరవాత చంపేశాడు. ఈ ఘటనతో సింగరేణి కాలనీ ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే...సింగరేణి కాలనీలో నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ సింగరేణి కాలనీలో నివాసం ఉంటోంది. కాగా సెప్టెంబర్ 9న ఇంటి నుండి పిల్లలతో ఆడుకునేందుకు బయటకు వెళ్లిన ఆరేళ్ల చిన్నారి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. పిల్లలతో కలిసి ఆడుకుంటున్న చిన్నారిని రాజు 30 అనే దుర్మార్గుడు చాక్లెట్ ఆశ చూపించి తీసుకెళ్లి ఇంట్లో బంధించి అత్యాచారం చేశాడు. అనంతరం రాజు చిన్నారిని హత్య చేశాడు.
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లి దండ్రులు పాపా కోసం గాలించి ఎక్కడా కనిపించకపోవడం తో అనుమానం వచ్చి రాజు ఇంటికి వెళ్లారు. కాగా రాజు ఇంటికి తాళం వేసి ఉంది. దాంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తాళం పగలగొట్టి చూడగా ఇంట్లో చిన్నారి విగతజీవిగా పడి ఉంది. దాంతో గుండెలు పగిలేలా రోదించి పోలీసులకు సమాచారం అందించారు. పోస్ట్ మార్టం రిపోర్టులో పాప గొంతు నుమిలి హతమార్చినట్టు తేలింది. చిన్నారిని హత్య చేసిన రాజు తన స్వగ్రామానికి పారిపోయాడు.
చిన్నారి మృతితో సింగరేణి కాలనీలో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాప మృత దేహంతో రహదారికి అడ్డంగా కూర్చుని ధర్నా చేశారు. నింధితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దాంతో మూడు వందల మంది పోలీసులు కాలనీకి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇక తాజాగా ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనతో తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యా అని చెప్పారు. గంటల వ్యవధిలోనే నేరస్థుడిని పట్టుకున్నారని కేటీఆర్ తెలిపారు. బాధిత కుంటుంబానికి వెంటనే న్యాయం చేయాలని కేటీఆర్ హోమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి చేశారు.