ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి కోవిడ్ -19 వైరస్కు వ్యాక్సిన్ వేయగలమని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. ఈ రోజు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంలో టీకాలు వేయడం డిసెంబర్ నాటికి పూర్తవుతుందని వెల్లడించినట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. నిజానికి గత వారమే కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ 2021 చివరి నాటికి భారతదేశంలో సింహభాగం జనాభాకు టీకాలు వేయడం పూర్తి చేసే స్థితిలో ఉంటుందని పేర్కొన్నారు. వైరస్ పరివర్తన చెందుతుందనే ఊహాగానాల మీద కూడా స్పందించిన ఆయన ప్రస్తుతం ఆరోగ్య సౌకర్యాలు అప్గ్రేడ్ అవుతున్నాయని హామీ ఇచ్చారు.
మే 21న జరిగిన COVID సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, "2021 ఆగస్టు మరియు డిసెంబర్ మధ్య, భారతదేశం 216 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను పూర్తి చేస్తామని అన్నారు. అంతే కాక ఈ ఏడాది జూలై నాటికి 51 కోట్ల మోతాదులను కొనుగోలు చేసి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. భారతదేశానికి టీకా ప్రణాళిక లేదని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించడంతో ఈ ప్రకటనను ప్రకాష్ జవదేకర్ తాజాగా మళ్ళీ ధృవీకరించారు. గతంలో కూడా మే 13న వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ నాటికి ఐదు నెలల కాలంలో 216 కోట్ల కరోనా టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలియజేసింది.
దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేసేందుకు ఇవి సరిపోతాయని పేర్కొన్నది. రష్యాలో తయారైన స్పుత్నిక్-వీ టీకా కూడా వచ్చేవారంలోగా అందుబాటులో ఉంటుందని ఆరోజున ప్రకటించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆగస్టు-డిసెంబరు మధ్య కాలంలో 75 కోట్ల డోసుల కొవిషీల్డ్, 55 కోట్ల డోసుల కొవాగ్జిన్ అందుబాటులోకి వస్తుంది. అలాగే వాటితో పాటు ‘బయోలాజికల్ ఈ’ ఫార్మా కంపెనీ 30 కోట్ల డోసులు, జైడస్ క్యాడిలా 5 కోట్ల డోసులు, సీరం ఇన్స్టిట్యూట్ 20 కోట్ల డోసుల నొవావాక్స్, భారత్ బయోటెక్ 10 కోట్ల డోసుల నాజల్ వ్యాక్సిన్, జెన్నోవా 6 కోట్ల డోసులను సిద్దం చేస్తాయి. వీటికి తోడు 15.6 కోట్ల స్పుత్నిక్-వీ డోసులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించింది. వస్తాయని పాల్ తెలిపారు. బయోలాజికల్ ఈ, జైడస్ క్యాడిలా, జెన్నోవా, భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ మొదలైనవి వేర్వేరు ప్రయోగదశల్లో ఉన్నాయన్నారు.