కరోనా ఫండ్ తో యువకుడు జల్సాలు చివరికి ?
తమ ప్రజలను కష్టాలనుంచి గట్టెక్కించడానికి, తిరిగి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రత్యేక ప్యాకేజీలతో ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. కరోనా క్రైసిస్ లో ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలబడేందుకు పలు పథకాలను కల్పించాయి. అయితే దీనిని అదునుగా చూసుకున్నా కొందరు ఆ పథకాలను వారి జల్సాలకు వాడుకుంటున్నారు. అమెరికాలో ఓ యువకుడు ఇదే తరహాలో జల్సాలు చేస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. కాలిఫోర్నియాకు చెందిన ముస్తాఫా ఖాద్రి అనే వ్యక్తి కరోనా ఫండ్ లోన్లు తీసుకొని తన ఇష్టానికి ఎంజాయ్ చేస్తూ ప్రభుత్వానికి టోపి పెట్టాడు. తనకు ఓ కంపెనీ ఉందని, కరోనా వైరస్ ప్రభావం వలన తన కంపెనీ తీవ్రంగా నష్టపోయిందని నకిలీ పత్రాలు సృష్టించి నమ్మబలికాడు.
ఈ మేరకు అమెరికా సర్కార్ కు నకిలీ ఐటీ రిటర్నులు, నకిలీ చెక్కులు సమర్పించి ప్రభుత్వం నుండి భారీ మొత్తంలో లోన్లు పొందాడు . అయితే ఈ అవకతవకలను గుర్తించిన అక్కడి బ్యాంకులు పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేశాయి. రంగంలోకి దిగిన అమెరికా పోలీసు అధికారులు అతడి మోసాన్ని బయట పెట్టారు. కరోనా ఫండ్ లోన్లు తీసుకొని తన వ్యాపారానికి ఉపయోగించకపోగా, విలాసాల కోసం కార్లను కొన్నాడని, 50 లక్షల వరకూ తన జల్సా ఖర్చులకు వినియోగించాడని గుర్తించారు. ఆ యువకుడి వద్ద ఉన్న 20 లక్షల డాలర్లను స్వాధీనపరచుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రజలను మోసం చేయడం ఒక ఎత్తయితే, ఏకంగా ప్రభుత్వ పథకాలను అడ్డం పెట్టుకుని మోసం చేయగలిగిన ఈ ఘటికుడు మరో ఎత్తు అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.