ఈ గుంటూరు ఎస్సీ సూప‌రంతే... సీఐకే ఫైన్ వేశాడు...!

VUYYURU SUBHASH
కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యం పెరిగిపోవటం.. భయం తగ్గిపోవటంతో.. అదే సమయంలో బలోపేతమైన వైరస్ పుణ్యమా అని కేసుల నమోదు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటివేళ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో కేసులు తగ్గిపోతున్న కారణంగా ముఖానికి మాస్కులు పెట్టుకోవటం తగ్గించేశారు. తాజాగా పెరుగుతున్న కేసులతో మాస్కులు వాడకం తప్పనిసరి చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలు మాస్కులు ధరించని వారికి ఫైన్లు వేస్తున్నాయి.

తాజాగా గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి.. గుంటూరు లాడ్జి కూడలి వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు పెట్టుకోని వారికి ఫైన్లు విధించటం.. మాస్కులు పెట్టుకోవాలంటూ కౌన్సెలింగ్ చేపట్టారు. అదే సమయంలో అటుగా వెళుతున్న గుంటూరు సీఐను ఆయన ఆపారు. మాస్కు పెట్టుకోకుండా ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. అత్యవసర విధుల్లో హాజరు కావటానికి వెళుతున్నానని.. దాంతో మాస్కు పెట్టుకోవటం మర్చిపోయినట్లుగా ఆ సీఐ బదులిచ్చారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నఆయన.. మాస్కు ధరించనందుకు ఫైన్ వేయాలని అధికారులకు సూచించారు.

అంతేకాదు..ప్రత్యేకంగా మాస్కు తెప్పించి మరీ ఆయన చేత ధరించేలా చేశారు. రోడ్డు మీద మాస్కులు పెట్టుకోకుండా వెళుతున్న వారిని ఆపి.. కౌన్సెలింగ్ చేసి పంపారు. వ్యాపారులు సైతం మాస్కులు ధరించిన వారినే లోపలకు అనుమతించాలని చెప్పారు. షాపుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ మాదిరి.. ప్రతి ఊరికి ఒకరిద్దరు అధికారులు ఈ తీరులో ఉంటే.. ప్రజలంతా మాస్కులు ధరించటం చాలా తక్కువ కాలంలోనే అలవాటు కావటం ఖాయం. ప్ర‌జ‌లు క‌రోనా జాగ్ర‌త్త‌లు మ‌ర్చిపోతున్నారు. ఇలా క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌క‌పోతే వీరు లైన్లోకి వ‌చ్చేలా లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: