దారుణం: ప్రేమ వివాహం.. బిడ్డ పుట్టిన 5రోజులకే భర్త దుర్మరణం..!?

N.ANJI
ఇద్దరు ఒక్కరిని ఒక్కరు ఇష్టపడ్డారు. ఇక ఇద్దరు పెద్దలను ఓడించి పెళ్లి చేసుకుని ప్రేమలో గెలిచారు. కానీ విధి వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. బిడ్డ పుట్టిన ఐదు రోజులకే భర్త ప్రమాదంలో కన్నుమూశాడు. అయితే బాలింతగా ఉన్న ఆమెకు భర్త చనిపోయాడన్న విషయం చెప్పడానికి కుటుంబ సభ్యులు సంకోచించారు. కానీ చివరి చూపు కూడా దక్కకపోతే జీవింతాంతం బాధ ఉంటుందన్న కారణంతో తప్పక విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె పడిన ఆవేదన చూపరులను కన్నీరు పెట్టించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కలకడ మండలం వడ్డిపల్లెకు చెందిన  గంగాధర (25)  ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అదే గ్రామానికి చెందిన బంధువుల అమ్మాయి మంగమ్మ ప్రేమించి పెద్దలు ఒప్పుకోకపోయినా ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్నాడు. స్థానిక ఇందిరమ్మ కాలనీకి తన నివాసముంటూ దంపతులు దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం మంగమ్మ పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో గంగాధర ఆనందంలో మునిగిపోయాడు. మనవడు పుట్టడంతో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కూడా కలిసిపోయి ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఈ తరుణంలో శుక్రవారం రాత్రి బైక్‌పై కలకడ నుంచి ఇంటికి వస్తూ చిత్తూరు–కర్నూలు నేషనల్ హైవేపై గంగాధర అదుపుతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108లో పీలేరు గవర్నమెంట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం గంగాధర తుదిశ్వాస విడిచాడు. కొడుకు మరణించాడని ఒకవైపు ఆగని దుఃఖం పిండేస్తున్నా.. మరోవైపు బాలింతైన కోడలికి విషయం చెప్పాలంటే భయం. తొలుత తలకు చిన్న గాయమైందని..ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఇక చివరకు విషయం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. భర్త చనిపోయాడన్న మాట విన్న వెంటనే మంగమ్మ పడిన ఆవేదన అక్కడ ఉన్నవారిని కన్నీళ్లు పెట్టించింది. కోటి ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుకుపెట్టిన ఆ దంపతుల జీవితాలను విధి ఇలా మార్చివేసింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: