అక్కడ టీడీపీని ఆ ఇద్దరే బ్రష్టు పట్టించేశారా... బాబు వదిలేస్తే అధోః గతే..!
నెల్లూరులో కీలక నేతలు ఉన్నారు. ఇటీవల పార్టీ ప్రకటించిన పదవులు అందుకున్న వారు కూడా ఉన్నా రు. బీద రవిచంద్ర యాదవ్ వంటి యువ నాయకత్వం కూడా ఉంది. కానీ.. ఎందుకో.. మౌనంగా ఉన్నారు. అయితే.. రెండు కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి హవానే ఇంకా కొనసాగుతుండడం వీరిలో చాలా మందికి ఇష్టం లేదు. దీనిని నేరుగా బయటకు చెప్పలేని పరిస్థితి నెలకొంది. పోనీ.. చంద్రబాబే తెలుసుకుని పార్టీలో మార్పులు చేస్తారా? అంటే.. అది కూడా లేదు.
ఇప్పటికే పార్టీని అన్ని విధాలా భ్రష్టు పట్టించారంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తినా పట్టించుకోలేదు. పైగా ఏం జరిగినా.. సోమిరెడ్డికే బాధ్యతలు అప్పగించడంతో... `ఇక మేం ఎందుకు?` అనే మాట వినిపిస్తోంది. వరుసగా విజయం సాధించిన కమ్మనేతలు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీలోకి వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారు. కానీ, పార్టీలో ఒక విధమైన స్తబ్దత కారణంగా ఎవరూ ముందుకు రాలేక పోతున్నారు. ఎవరూ పనిచేయలేక పోతున్నారు.
ఇటు సిటీలో మైనార్టీ నేత అజీజ్, అటు జిల్లాలో సోమిరెడ్డి కారణంగా ఎవరూ బయటకు రావడం లేదని తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి నారాయణ ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో నెల్లూరు టీడీపీని బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు.