జగన్ జనరంజక పాలనకు ఏడాది పూర్తి.... రాష్ట్రంలోని ప్రజలు ఏమంటున్నారంటే...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 23 సరికొత్త అధ్యాయం లిఖించిన రోజు.... విశ్వసనీయత, విలువలకు పట్టం కట్టిన రోజు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తైంది. 2014లో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రజల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించింది. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతికి, అక్రమాలకు పాల్పడింది. అర్హులకు పథకాలు మంజూరు చేయకుండా పార్టీకి మద్దతు ఇచ్చే వారికి మాత్రమే పథకాలు అమలు చేస్తూ ప్రజల్లో వ్యతిరేకత పెంచుకుంది.
2019 ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలతో మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నించినా టీడీపీ మూకుమ్మడి కుట్రలను ప్రజలు తిప్పికొట్టి ప్రజా కంటక పాలనకు గతేడాది ఇదే రోజున ముగింపు పలికారు. రాష్ట్రంలో తిరుగులేని ప్రజాబలంతో చరిత్రలో కనీవిని ఎరుగని విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. 86 శాతం అసెంబ్లీ సీట్లు, 92 శాతం ఎంపీ సీట్లతో వైసీపీ రాజకీయాల్లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది.
అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ పథకాలను అమలు చేసిన తీరు, గ్రామ వాలంటీర్ల, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ పథకాలను ఇంటి దగ్గరకు చేరేలా చర్యలు చేపట్టడం ప్రతిపక్షాలతో పాటు ప్రముఖ రాజకీయ పార్టీలను సైతం ఆశ్చర్యపరిచింది. జగన్ సాధించిన ఘన విజయం నాడు దేశంలోని రాజకీయపార్టీలను, మీడియా ఛానెళ్లను సైతం ఆశ్చర్యపరిచింది. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హమీలను కూడా నెరవేరుస్తున్నారు.
జగన్ పాలనపై రాష్ట్రంలోని ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పథకాల అమలు విషయంలో జగన్ పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ పథకాల అమలు జరిగిందని గతంలో ఏ సీఎం చేయని విధంగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారని 2024, 2029 ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.