బావిలో దూకి మందు కావాలంటూ మొండికేసిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందంటే..?
మందు బాబులం మేము మందు బాబులం.. అంటూ ఎప్పుడూ ఎంజాయ్ చేసే మందుబాబులు ఇప్పుడు ఒక్క చుక్క కూడా మద్యం దొరక్క నానా ఇబ్బందులూ పడుతున్నారు. లాక్డౌన్ దెబ్బకు మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. దాదాపు రెండు వారాలుగా షాపులు లేకపోవడంతో చుక్క పడక మందుబాబులు పిచ్చెక్కిపోతున్నారు. లాక్ డౌన్తో సామాన్యుల పరిస్థితి ఏమో కానీ.. మందుబాబుల కష్టాలు మాత్రం అన్నీ ఇన్నీ కావు. కనీసం బ్లాకులో కొందామన్నా కూడా వారికి ఎక్కడా దొరకడం లేదట.
ముఖ్యంగా రోజు మద్యం సేవించడం అలవాటు ఉన్నవారికి ఒక్కసారిగా మందు దొరక్కపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలున్నాయి. మరికొందరు మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు వింతగా ప్రవరిస్తున్నారు. దీంతో వారి కుటుంబసభ్యులు.. వారిని ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వ్యక్తి మద్యం దొరక్క బావిలో దూకేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని పట్టాభిరాం ప్రాంతానికి చెందినయ 46 ఏళ్ల మనవాలన్ స్థానికంగా దినసరి కూలీగా పనిచేస్తున్నాడు.
అతడికి భార్యా ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ప్రతి రోజు పనికి వెళ్లొచ్చాక మందు తాగడం మనవాలన్కు అలవాటుగా మారింది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా అతడికి మద్యం దొరకలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతడు మంగళవారం రాత్రి ఇంటి ఆవరణలో ఉన్న బావిలో దూకేశాడు మనవాలన్. అతడికి ఈత రావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్దగా భయపడలేదు.
కానీ బావి నుంచి పైకి వచ్చేందుకు అతడు నిరాకరించాడు. మద్యం బాటిల్ ఇప్పిస్తేనే బయటకు వస్తానంటూ మొండికేశాడు. రెస్క్యూ సిబ్బంది వచ్చి చెప్పినా వినలేదు. ఇక చేసేదేమి లేక రెస్క్యూ సిబ్బందే తాడు సాయంతో బావిలోకి దిగి అతడిని పైకి లాగారు. ఆ తర్వాత అతడికి క్వార్టర్ బాటిల్ ఇవ్వడంతో శాంతించాడు.