జనసేపపై రాపాక కీలక వ్యాఖ్యలు...
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతకాలం క్రితం వరకు జనసేన పార్టీతో సఖ్యతగా ఉన్న ఎమ్మెల్యే రాపాక, వైకాపా మూడు రాజధానులను ప్రకటించిన తరువాత వైకాపాకు జై కొట్టాడు. జగన్ కు పాలాభిషేకం చేశారు. మూడు రాజధానులు ఉంటేనే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే అసెంబ్లీలో కూడా ప్రవర్తించారు.
జనసేన ఎమ్మెల్యే వైకాపాకు జై కొట్టడంతో జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా మాట్లాడటం సరికాదని పేర్కొంది. రాపాకా తీసుకున్న నిర్ణయంపై జనసేన పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా గతంలో వార్తలు కూడా వచ్చాయి. కానీ, అలా జరిగినట్టుగా ఎక్కడా లేదు. జనసేన పార్టీ కూడా ఆ విషయాన్నీ లైట్ గా తీసుకుంది.
తమ పార్టీకి ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నారని, ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా జనసేనతో ఉన్నాడో లేడో కూడా తెలియడం లేదని జనసేన పార్టీ చీఫ్ పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ, జనసేన పార్టీ కార్యక్రమాలకు కూడా రాపాక దూరంగా ఉంటున్నారు. ఇప్పటి వరకు అయన మంగళగిరి ఆఫీస్ కు అటెండ్ కాలేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు.
అయితే, దీనిపై రాపాక ఓ వివరణ ఇచ్చారు. తాను మూడు రాజధానులు కట్టుబడి ఉన్నానని, కార్యనిర్వాహక రాజధాని విశాఖకు తీసుకురావడం వలన ఉత్తరాంధ్రా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అందుకే తాను మూడు రాజధానులు అనుకూలంగా ఉన్నానని చెప్పారు. తను ఇప్పటికి జనసేన పార్టీలోనే ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. పార్టీకి దూరంగా లేనని, అలాగని దగ్గరగా కూడా లేనని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీతో ఆయన ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఈరోజు రాపాక చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అనుకూలంగా మాట్లాడుతుందా లేదంటే లైట్ గా తీసుకుంటుందా?