హవ్వా ... అజిత్ తో జతకడుతారా ? బీజేపీ రాజకీయ విలువలు ఇవేనా ??
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ )కి ఏమాత్రం రాజకీయ విలువలు లేవన్న విషయం స్పష్టం అవుతోందని తటస్థులు అభిప్రాయపడుతున్నారు . ఎన్సీపీ చీలిక వర్గంతో బిజెపి జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాలువ్యక్తం అవుతున్నాయి . ఎన్నికలకు ముందు ఎన్సీపీ నాయకత్వాన్ని బిజెపి నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్సీపీ తో బీజేపీ ఎప్పటికీ జతకట్టేది లేదంటూ గతం లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ట్వీట్ ను ఈ సందర్బంగా తటస్థులు ప్రస్తావిస్తున్నారు .
ఇక ఎన్సీపీ నేత అజిత్ పవార్ పై బీజేపీ నేతలు ఎన్ని అవినీతి ఆరోపణలు చేయాలో అన్ని చేశారు . ఇప్పుడదే అజిత్ పవార్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల తటస్థులు మండిపడుతున్నారు . బీజేపీ తో జతకట్టి ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన అజిత్ పవార్ కు ఇటీవలే సీబీఐ, ఈడీ నోటీసులు కూడా అందాయి . అజిత్ పవార్ ను త్వరలోనే విచారణ పిలుస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అజిత్ పవార్ అంటూ విమర్శలు గుప్పించిన బిజెపి నాయకులు, ఇప్పుడు అదే అజిత్ పవార్ తో జత కట్టడానికి ఎలా సమర్ధించుకుంటారని తటస్థులు ప్రశ్నిస్తున్నారు .
బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ విశ్వాస పరీక్షను ఎదుర్కోవల్సి ఉంటుంది . ఇక విశ్వాస పరీక్షలు ఎలాగో, అలాగా నెగ్గిన , ఈ ప్రభుతం ఎన్నాళ్లు కొనసాగుతుందోనన్న అనుమానాలు లేకపోలేదు . ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్య బలం లేకపోయినా, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసినట్లుగానే బీజేపీ నాయకత్వం , మహారాష్ట్రలోనూ సర్కార్ ను అయితే ఏర్పాటు చేసింది ...కానీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఇంకా ఎన్ని అడ్డదారులు తొక్కనుందోనన్నదే ప్రశ్నార్ధకంగా మారింది .