నడి వీధిలో చితక్కొట్టుకున్న పోలీసులు, లాయర్లు !
దేశ రాజధానిలో పోలీసులు, లాయర్ల మధ్య గొడవ రణరంగాన్ని తలపించింది. పోలీస్ వ్యాన్ను ఓ న్యాయవాది కారు ఢీకొట్టడంతో తలెత్తిన వివాదం ...చిలికి చిలికి గాలివానగా మారింది. లాయర్ ను పోలీసులు కొట్టడం... పోలీసు వాహనాలకు న్యాయవాదులు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు, లాయర్లు గాయపడ్డారు.
ఒకరు ప్రజలకు రక్షణగా నిలిచే రక్షకభటులు. మరొకరు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే న్యాయవాదులు. శాంతిభద్రతలను కాపాడాల్సిన వీరు... వీధిన పడి పోట్లాడుకున్నారు. ఇరువర్గాల విధ్వంసంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హస్తినలోని తీస్ హజారీ కోర్టు ఆవరణలో పోలీసులకు, లాయర్లకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, పలువురు లాయర్లు గాయపడ్డారు. వీరిలో ఒక పోలీస్ కమిషనర్ కూడా ఉన్నారు. 17 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక పోలీసు వాహనం మంటల్లో కాలిపోయింది.