అచ్చం కేసీఆర్ లాగానే...ప్రభుత్వ వైద్యులను ఆ సర్కారు తొలగిస్తుందట
గత శుక్రవారం నుంచి తమిళనాడు రాష్ట్రంలోని 15 వేలమంది ప్రభుత్వ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. సరైన జీతాలు, పదోన్నతులు డిమాండ్ చేస్తూ.. దాదాపు 18 వేల మంది వైద్యులు ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రోడ్డెక్కారు. అత్యవసర సేవలు మినహాయించి... మిగతా వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిపివేశారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే చేరిన రోగులు అవస్థలు పడుతున్నారు. వైద్య సేవలు అందక ఔట్పేషెంట్ వార్డుల్లో వందలాది మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అయినా... ఇప్పటివరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను శాంతి పరిచే ప్రయత్నాలేవీ చేయలేదు. మరోవైపు ఈ పరిస్థితిని సీరియస్గా తీసుకున్న మంత్రి విజయభాస్కర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా డాక్టర్లు సమ్మె చేస్తున్నారని వారు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. విధుల్లో చేరకపోతే వారి స్థానంలో కొత్త డాక్టర్లు ఉద్యోగాల్లో చేరుతారని స్పష్టం చేశారు. అంతేకాదు సమ్మె చేస్తున్న వారిని తొలగిస్తామని హెచ్చరించారు.