ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన నేతలు...తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తే...ఎలా జరుగుతుందో తెలియజేసేందుకు ఇదో ఉదాహరణ. చైతన్యవంతమైన సమాజం ఉన్న చోట వారు ఏ విధంగా ప్రశ్నిస్తారో తెలియజేసే ఉదంతం ఇది. నిధుల దుర్వినియోగం కేసులో ఏకంగా ప్రధానమంత్రి భార్యకే కోర్టు సంచలన శిక్షణ విధించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భార్య సారా నెత్యనాహు(60) నిధుల దుర్వినియోగం కేసులో దోషిగా తేలారు. దీంతో జెరూసలెం కోర్టు ఆమెకు 10,000 షేకిల్స్ (సుమారు రూ.2 లక్షలు) జరిమానాతో పాటు దుర్వినియోగం చేసిన 45,000 షేకిల్స్(సుమారు రూ.9 లక్షలు)ను 9 విడుతల్లో చెల్లించాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే...బెంజమిన్ నెతన్యాహు 2009 నుంచి ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నారు. ఆయన భార్య సారా నెతన్యాహు ఆయనతోనే అధికార నివాసంలో ఉంటున్నారు. అక్కడ వారికి భోజనం వండేందుకు ఓ వంటమనిషి ఉన్నప్పటికీ సారా నెతన్యాహు బయట నుంచి భోజనం తెప్పించుకుంటున్నారు. 2018 జూన్లో దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజా నిధులను మోసపూరితంగా దుర్వినియోగం చేసినట్లు ఆమె అంగీకరించడంతో జెరూసలెం కోర్టు న్యాయమూర్తి దోషిగా నిర్ధారించి తక్కువ మొత్తంలో జరిమానా విధించారు. సారా నెతన్యాహు వినతి మేరకు భోజనం కోసం దుర్వినియోగం చేసిన నిధులను 9 విడుతల్లో తిరిగి చెల్లించేందుకు అంగీకరించారు.
ఇలా నిధులు దుర్వినియోగం విషయంలో...భారతదేశంలో ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారం తమ హక్కు భుక్తంగా భావించే నేతలు...ప్రజాధనాన్ని విచ్చలవిడిగా తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. వేల కోట్ల ప్రజాధనం వృథా చేస్తున్నారు. ఇటీవల కేవలం డ్రైఫూట్స్కే 18 లక్షల ఖర్చును టీడీపీ ప్రభుత్వం హయాంలో ఓ విభాగ అధికారులు ఖర్చు చేసినట్లు వెలువడిన లెక్కలు ఇలాంటి దుర్వినియోగానికి పరాకాష్ట. అలాంటి సంఘటనలకు తాజాగా ఇజ్రాయిల్ దేశంలోని తీర్పు నిజంగా సంచలనమే.