వైసీపీ అధినేత జగన్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. ఫలితాల వెల్లడికి మరో ఐదు రోజుల టైం ఉండగానే సోషల్ మీడియాలో వైసీపీ హంగామా మామూలుగా లేదు. మెజార్టీ సర్వేలు వైసీపీకే అధికారంలోకి వస్తుందని చెప్పడంతో పాటు పోలింగ్ సరళి కూడా ఈ ధీమాకు కారణమవ్వోచ్చు. ఇదిలా ఉంటే జగన్ గెలిస్తే ఆయన కేబినెట్లో ఎవరెవరు మంత్రులుగా ఉంటారన్న లెక్కలు కూడా స్టార్ట్ అయిపోయాయి. సీఎం కాకుండా కేబినెట్లో మొత్తం 26 మందికి మంత్రులుగా ఛాన్స్ ఉంటుంది.
ఇక స్పీకర్గా చంద్రబాబును ఢీకొట్టేందుకు ఆయన తోడళ్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్గా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పేరు లైన్లో ఉంది. ఇక మంత్రుల విషయానికి వస్తే పార్టీలో సీనియర్ నేతలుగా ఉండడంతో పాటు తన కోసం త్యాగాలు చేసిన వారికి ఈ దఫా మంత్రి పదవులు ఇస్తున్నారు. వీరిలో పెద్దిరెడ్డి, బొత్స, ధర్మాన, కొడాలి నాని, శ్రీకాంత్రెడ్డి, పిల్లి బోస్, రోజా, బాలినేని లాంటి సీనియర్లు ఉన్నారు.
సామాజికవర్గాల పరంగా పార్టీ పునాది నుంచి నేటి వరకు కష్టపడింది రెడ్డి వర్గం వాళ్లే కాబట్టి ఆ వర్గం నుంచి 10 మందికి తగ్గకుండా మంత్రి పదవులు దక్కనున్నాయి. కమ్మ వర్గంలో కొడాలి నాని, మర్రి రాజశేఖర్ ఉంటారు. కాపుల్లో కూడా గ్రంధి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాళ్లు లైన్లో ఉన్నారు. ఇక బ్రాహ్మిణ్స్కు గతంలో ఎవ్వరూ ఇవ్వనంత గౌరవం జగన్ ఇచ్చారు. ఏకంగా నలుగురు బ్రాహ్మణ్లకు సీటు ఇచ్చిన జగన్ బాపట్ల నుంచి గెలిచే కోన రఘుపతికి దేవాదాయ శాఖ పదవి ఇస్తారంటున్నారు.
ఎస్సీల్లో తానేటి వనిత, కొక్కిలిగడ్డ రక్షణనిధితో పాటు ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్, కడప జిల్లా నుంచి కె.శ్రీనివాసులు రేసులో ఉన్నారు. ఎస్టీ కోటాలో కొట్టంగుళ్ల భాగ్యలక్ష్మి, మైనార్టీ కోటాలో ఇక్బాల్ అహ్మద్ పేర్లు ఉన్నాయి. ఇక స్పీకర్ సీటు కమ్మలకు ఇస్తే, డిప్యూటీ స్పీకర్ సీటు ఎస్సీలకు ఇచ్చినట్లవుతుంది. ఏదేమైనా జగన్ అన్నీ ఈక్వేషన్లు బ్యాలెన్స్ చేసుకుని కేబినెట్ కూర్పు చేస్తున్నట్లవుతుంది. అలాగే జిల్లాలు , ప్రాంతాల వారీగా కూడా లెక్కలు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.