రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండవనే మాటను మనం తరచూ వింటుంటాం. అయితే ఈ మాట కేవలం ప్రత్యర్థుల విషయంలోనే కాదు... కుటుంబంలోనూ నిజమే అని రుజువైంది. కుటుంబం అంటే ఓ భార్య, భర్తను సైతం ఎన్నికలు కలిపాయి. అసలు మేటర్లోకి వెళితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా మోతె గ్రామంలో భార్య, భర్తలు విడిపోయారు. ఐదేళ్లుగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు.
లక్ష్మణ్ - కవిత దంపతుల మధ్య గ్యాప్ రావడంతో వీరు దూరంగా ఉంటున్నారు. తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో కవితకు గ్రామంలో ఓ పార్టీ నుంచి ఎంపీటీసీ అభ్యర్థిత్వం ఖరారైంది. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్ తన భార్యకు అండగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఆమెకు ఎన్నికల ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చాడు. అప్పటి వరకు ఎన్నోసార్లు వీరిని కలపాలని పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. ఎన్నికల పుణ్యాన భార్యభర్తలిద్దరూ మళ్లీ ఏకమయ్యారు.
ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు భార్యభర్తలు ఇద్దరూ కలిసి ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్లుగా దూరంగా ఉంటోన్న వీరిని ఎంపీటీసీ టిక్కెట్ మొత్తానికి కలిపింది. ఇక ఎన్నికల ముందే ప్రజల మనస్సులు గెలుచుకున్న ఈ దంపతులు ప్రచారంలో ఆకట్టుకుంటున్నారు. మరి కవితను లక్ష్మణ్ గెలిపిస్తాడా ? లేదా ? చూడాలి. ఇక తెలంగాణలో జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడతలో ఇప్పటికే రెండు జడ్పీటీసీ, 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీమయ్యాయి. ఈ రెండు స్థానాలు అధికార టీఆర్ఎస్ దక్కించుకుంది.