సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు ఒక్కోసారి ఎలాంటి విపరిణామాలకు దారితీస్తాయో...గత ఏడాది జరిగిన మూకదాడులే నిదర్శనం. ఇక ప్రముఖుల విషయంలో జరిగే ప్రచారానికి అడ్డూ అదుపు ఉండదు. ఇలాంటి చిత్రమైన ప్రచారం వల్ల పరేషాన్ అయింది. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ భార్య, ఆయన భార్య నితి దేవ్. విప్లవ్ తన భార్యను వేధింపులకు గురిచేస్తూ, గృహహింసకు పాల్పడ్డారని.. ఈ క్రమంలో నితి దేవ్ ఆయనకు విడాకులు ఇవ్వనున్నారని కొన్ని ఛానెళ్లలో ప్రసారం అయింది. సహజంగానే ఈ వార్త కథనం సంచలనం సృష్టించింది.
ఈ నేపథ్యంలో విప్లవ్ దేవ్ భార్య నితి దేవ్ స్పందించారు. రాష్ర్టాభివృద్ధి కోసం బిప్లవ్ దేవ్ కష్టపడుతున్నారని అయితే, కొంతమంది మాత్రం పనిగట్టుకొని తన భర్తను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తాను విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. విడాకుల సమాచారం తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యా. గత 15 రోజుల నుంచి నేను మా ఇంటికి దూరంగా ఉంటున్నాను. దీంతో ఈ పుకార్లు సృష్టించి సర్క్యూలేట్ చేశారు. నా పిల్లల గురించే నేను చాలా బాధపడ్డాను. వాళ్లకు ఈ విషయం తెలిస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు? ``అంటూ విడాకుల పుకార్లపై మండిపడ్డారు.
బిప్లవ్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడన్న వార్తలు ఏ మాత్రం నిజం కాదన్నారు. ``ఒకవేళ నేను లీగల్ పిటిషన్ దాఖలు చేసి ఉంటే.. వేరే వాళ్లతో ఈ వార్తను ఎందుకు విస్తృతంగా వైరల్ చేస్తాను. నేనే అందరికీ దీని గురించి చెప్పేదాణ్ని. ఒక మహిళ గురించి ఏదైనా చెప్పడం చాలా సులువు. ఇంతకుముందు మా రాష్ట్ర మంత్రి శంతనా చక్మాను లక్ష్యంగా చేసుకున్నారు..ఈసారి ఏకంగా నన్నే టార్గెట్ చేసి నా భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారు` అని మండిపడ్డారు.