ఎడిటోరియల్ : ఆ నియోజకవర్గాలపై టిడిపి ఆశలు వదులుకోవాల్సిందేనా ?
చూడబోతే పరిస్ధితి అలాగే
అనిపిస్తోంది. ఉన్న సమస్యలకు తోడు కొత్తగా రెబల్స్ రూపంలో చంద్రబాబునాయుడును మరో
సమస్య చుట్టుముట్టింది. వివిధ కారణాల వల్ల చంద్రబాబు సుమారు 40 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను
మార్చేశారు. ఇందులో కొందరు సిట్టింగ్ ఎంఎల్ఏలున్నారు. మరికొందరు చాలాకాలంగా
నియోజకవర్గ సమన్వయకర్తలుగా పనులు చేసినవారున్నారు.
రాబోయే ఎన్నికల్లో మీకే టికెట్ అని చంద్రబాబు చెప్పటంతో చాలామంది సమన్వయకర్తలు భారీగా డబ్బులు ఖర్చులు పెట్టుకున్నారు. తీరా ఎన్నికలు దగ్గరపడిన తర్వాత టికెట్లు ఇంకోరికిచ్చారు. చివరినిముషంలో తమను మార్చేయటంతో చాలామంది నేతలు చంద్రబాబుపై మండిపోతున్నారు. అలాగే సర్వేల్లో ఫీడ్ బ్యాక్ బాగా లేదన్న కారణంతో కొందరు ఎంఎల్ఏలను కూడా పక్కనపెట్టారు. దాంతో సిట్టింగులు, సీనియర్ నేతలు రెబల్స్ అభ్యర్ధులుగా రంగంలోకి దిగుతున్నారు.
విజయనగరం, నిడదవోలు, పోలవరం, కర్నూలు, కల్యాణదుర్గం, చింతలపూడి, శింగనమల, తంబళ్ళపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగులు తిరుగుబాటు అభ్యర్ధులుగా రంగంలోకి దిగుతున్నారు. వీరుకాకుండా నెల్లిమర్ల, పోలవరం, నర్సరావుపేట, దర్శి, మాచర్ల, సత్యవేడు, పూతలపట్టు, తాడేపల్లిగూడెం, తిరువూరు, నూజివీడు, తాడికొండ, గుంటూరు ఈస్ట్ తదితర నియోజకవర్గాల్లో కూడా తిరుగుబటు అభ్యర్ధులు నామినేషన్లకు రెడీ అవుతున్నారు.
సరే చంద్రబాబు మీద కోపంతో 40 నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్ధులు పోటీ చేయాలని నిర్ణయించుకున్నా ఎంతమంది చివరిదాకా రంగంలో ఉంటారో తెలీదు. ఎందుకంటే తిరుగుబాటు అభ్యర్ధులను బుజ్జగించేందుకు చంద్రబాబు కొందరు సీనియర్ నేతలను రంగంలోకి దింపారు. అందరూ పోటీ నుండి తప్పుకోకపోయినా కనీసం 20 నియోజకవర్గాల్లో అయినా తిరుగుబాట్లు పోటీ చేయటం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి.
రెబల్స్ సమస్య ఎందుకొచ్చిందంటే ఐదేళ్ళల్లో పలువురు ఎంఎల్ఏలు, నేతలు బాగా డబ్బుచేసున్నారు. కాబట్టి ఎంతైనా ఖర్చు పెట్టటానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే గతంలో ఎప్పుడూ లేనివిధంగా టిడిపి తరపున 40 మంది రెబల్స్ అభ్యర్ధులుగా నిలుస్తున్నారు. చివరికి వీరిలో ఎంతమంది పోటీలో ఉంటారో తెలీదుకానీ ఎంతమందున్నా టిడిపికి నష్టమనే చెప్పాలి.