తెలంగాణాలో ముందస్తు ఎన్నికల హడావుడి ఏపిలో చంద్రబాబునాయుడు మెడకు చుట్టుకునేట్లుంది. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందనే సామెతలాగ తయారైంది ఓటుకునోటు కేసు వ్యవహారం. తెలంగాణా ఎన్నికల్లో మళ్ళీ అధికారం నిలుపుకోవటంలో భాగంగానే కెసియార్ రాజకీయంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణాలో టిడిపి పరిస్దితి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ ఒక్కటే గట్టి పోటీ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.
రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, టిడిపిలు కలిసాయి. వీటితో పాటు సిపిఐ, కోదండరామ్ పార్టీ తదితరాలు కూడా తోడయ్యాయి. దాంతో కెసిఆర్ కి ఇబ్బంది మొదలైంది. మహాకూటమిలోని పార్టీల మధ్య ఓట్లు సరిగ్గా ట్రాన్స్ ఫర్ అయితే టిఆర్ఎస్ కు 100 సీట్లు వచ్చేది అనుమానమే.
ఈ నేపధ్యంలో కెసియార్ దృష్టి ముందుగా కాంగ్రెస్ నేతలపై పడింది.
ఇంకేముంది రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా కొందరు నేతలపై ఉన్న పాత కేసులు హఠాత్తుగా బయటకు వస్తున్నాయి. అందులో భాగమే జగ్గారెడ్డిపై మానవ అక్రమ రవాణా కేసు, రేవంత్ పై జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో ప్లాట్ల అక్రమ కేటాయింపుల కేసు. సరే, ఎటూ ఓటుకునోటు కేసు ఉండనే ఉంది కదా ? ఆ కేసులోనే తాజాగా ఐటి దాడులు జరిగాయి.
ఓటుకునోటు కేసులో రేవంత్ పై ఐటి దాడులంటే ఆటోమేటిక్ గా చంద్రబాబు కూడా ఇరుక్కుంటారు. ఎందుకంటే, ఓటుకునోటు కేసు వెనకున్నదే చంద్రబాబని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో కీలకమైన నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ తో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబే. చంద్రబాబు తరపునే స్టీఫెన్ తో ఏ 1 రేవంత్ కుదుర్చుకున్న రూ .5 కోట్ల బేరంలో రూ. 50 లక్షల అడ్వాన్స్ ఇచ్చేందుకు వెళ్ళి తగులుకున్నారు. ఇపుడా కేసులోనే ఐటి దాడులు జరిగాయి. పనిలో పనిగా ఏ 2 స్టీఫెన్ సన్ ఇంట్లో కూడా ఐటి సోదాలు జరిగాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న రేవంత్ ను వెంటనే రమ్మని ఐటి అధికారులు ఆదేశించారు. ఒకవేళ రేవంత్ రాగానే విచారణ పేరుతో మళ్లీ అరెస్టు చేస్తారేమోననే అనుమానాలు మొదలయ్యాయి. అదే నిజమైతే చంద్రబాబుకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చనే ప్రచారం ఊపందుకుంది. చంద్రబాబు కూడా ఇటువంటి ఇబ్బందేదో వస్తుందని ఎప్పటి నుండో అనుమానిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకటి రెండు రోజుల్లో ఓటుకునోటు కేసు విచారణలో సంచలనాలు చూడవచ్చేమో ?