కడప నేతల మధ్య పంచాయితీ చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఏ ఇద్దరు నేతల మధ్య సఖ్యత లేదు. ఒకవైపు దగ్గరపడుతున్న ఎన్నికలు ఇంకోవైపు పెరిగిపోతున్న నేతల వివాదాలు. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. ఈరోజు కడపలో యోగి వేమన యూనివర్సిటీలో కార్యక్రమం తర్వాత జిల్లాలోని కీలక నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
ఆది ఫిరాయింపు తర్వాతే సమస్యలు
పోయిన ఎన్నికల వరకూ జిల్లాలోని నేతల మధ్య పెద్దగా వివాదాలుండేవి కావు. ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ళపాటు ఎలాగో నెట్టుకొచ్చేశారు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అందులోనూ జమ్మలమడుగు ఎంఎల్ఏ ఆది నారాయణరెడ్డి టిడిపిలోకి ఫిరాయించారో అప్పటి నుండి సమస్యలు మొదలైనాయి. ఆ సమస్యలకు తోడు రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోవటంతో విభేదాలతో నేతలు రోడ్డునపడ్డారు. జిల్లా మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలన్నది రమేష్ తాపత్రయాన్ని మెజారిటీ నేతలు వ్యతిరేకిస్తుండటంతో ప్రతిరోజు జిల్లాలో గొడవలే.
సిఎం సర్దుబాటు చేసినా కుదరటం లేదు
జిల్లాలోని పది నియోజకవర్గాల్లో చాలా చోట్ల నేతల మధ్య వివాదాలు తారస్ధాయికి చేరుకున్నాయి. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నా నేతల మధ్య సమన్వయం మాత్రం కుదరటం లేదు. ఎన్నిసార్లు చంద్రబాబు సర్దుబాటుకు ప్రయత్నించినా ఎవరూ వెనక్కు తగ్గటం లేదు. నేతల మధ్య పెరుగుతున్న వివాదాలు రాబోయే ఎన్నికల్లో పార్టీ కొంపముంచుతాయనే టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోంది. జిల్లా నేతల మధ్య వివాదాలను సర్ధుబాటు చేయటానికి చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి తగ్గకపోగా మరింత పెరిగిపోతున్నాయి.
నేతల మధ్య ఉప్పు నిప్పు
జిల్లాలో జమ్మలమడుగులో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి-ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి వర్గాలకు మొదటినుండి పడదన్న విషయం తెలిసిందే. ప్రొద్దుటూరులో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్-మాజీ ఎంఎల్ఏ వరదరాజుల రెడ్డి వర్గాలకు ఉప్పు-నిప్పు. అదే సమయంలో ఫిరాయింపు మంత్రి, రాజ్యసభ సభ్యుడు, ఎంఎల్సీ వర్గాల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక, బద్వేలులో ఫిరాయింపు ఎంఎల్ఏ జయరాములు-మాజీ ఎంఎల్ఏ విజయమ్మ, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన విజయజ్యోతి వర్గాలకు ఏమాత్రం పడటం లేదు.
ఏడు నియోజకవర్గాల్లో వివాదాలు
అదే విధంగా కడప, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో కూడా నేతలు వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రధానంగా ఫిరాయింపు మంత్రి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ తో జిల్లాలోని నేతల్లో చాలామందికి పడటం లేదు. అందరూ బాగున్నారని అనుకున్న పోయిన ఎన్నికల్లోనే టిడిపి గెలిచింది ఒక్క నియోజకవర్గమన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది నేతల మధ్య పెరిగిపోయిన గొడవల వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ పూర్తిగా ముణిగిపోతుందో అన్న ఆందోళన చంద్రబాబులో స్పష్టంగా కనబడుతోంది. అందుకే ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు.