రాజకీయాలు అందరూ చేస్తారు. అయితే, ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కొత్తగా వార్నింగ్ రాజకీయాలకు తెరదీశారు. ఏపీలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ నాయకులు, పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ సంగతి తేలుస్తామంటూ జనసేనాని తాజాగా హెచ్చరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని 2014లో జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే తాడేపల్లిగూడెంను కబ్జాల ప్రాంతంగా మార్చేశారంటూ జడ్పీ చైర్మన్పై ఆరోపణలు గుప్పించారు. చెరువులు కబ్జా కు గురవుతున్నాయంటూ ఆరోపించారు. ఏరుదాటిన తరువాత తెప్ప తగలేసే రాజకీయాలు తెలుగుదేశం చేస్తుంద ని ఆరోపించారు. చెరువులను పూడ్చివేయడం, మట్టి, ఇసుక అమ్ముకోవడం జరుగుతోందని తూర్పారబట్టారు.
అంతా బాగానే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎదుటి పార్టీ నాయకులను విమర్శించడం సహజమే .. కానీ, మేం అధికారంలోకి వస్తే.. అంటూ.. వార్నింగులు ఇవ్వడం ఇప్పుడు జనసేనాకి సోషల్ మీడియాలో సెగ తగిలేలా చేస్తోంది. గతంలో వైసీపీ నాయకులు కూడా అధికారులపై ఇలానే విరుచుకుపడ్డారు. మేం అధికారంలోకి వస్తే.. మీకు జైలు గతే.. అంటూ నాయకు లు అధికారులను లైన్లో పెట్టుకునే పనిచేశారు. అయితే, అప్పట్లో ఇవే వ్యాఖ్యలను పవన్ తప్పుబట్టారు. ఆఫ్ కోర్స్.. అప్పట్లో ఈయన చంద్రబాబుకు పూర్తిగా మద్దతిస్తున్నారు కాబట్టి వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తప్పుగా కనిపించి ఉంటాయి. కానీ, ఇప్పుడు చంద్రబాబు, ఆయన గ్యాంగ్ అసలు సిసలు నిజస్వరూపం చూస్తున్నందున ఇప్పుడు ఆయన కూడా వైసీపీ బాటలోకి వచ్చేశారనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి.
ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్.. ఇక్కడ టీడీపీ నాయకులు అధికారం అడ్డు పెట్టుకుని చెలరేగి పోతున్నారని పవన్ వాదించారు. అంతా బాగానే ఉంది కానీ, రాజకీయాల్లో తాను చెప్పిన సూక్తులను తాను కూడా పాటించలేరా? అంటూ పవన్ను కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆయన పారదర్శకమైన రాజకీయాలు తీసుకు వస్తానంటూ... ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు తెరమీదికి తెస్తున్నారు. కానీ, పవన్ కూడా వైసీపీ నేతల మాదిరిగానే కక్ష రాజకీయాలకు తెరదీ యడం ఏంటనే ప్రశ్న వస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజకీయాలు పనికిరావని గతంలోనే పవన్ చేసిన వ్యాఖ్యల తాలూకు క్లిప్పింగులను కొందరు సోషల్ మీడియాలో పెట్టి ఏకేస్తున్నారు. మరి వీటికి పవన్ ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.