ఏపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన విపక్షం వైసీపీ అధినేత జగన్ పునరాలోచనలో పడ్డారని తాజాగా తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబును, ఆ పార్టీని ఏకేయడానికి ఇప్పుడున్న అవకాశం కన్నా.. అసెంబ్లీని వేదిక చేసుకుంటే బెటరని ఆయన తనకు అత్యంత సన్నిహితుల వద్ద అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకపక్క రాష్ట్రంలోని పలు పార్టీలు కూడా చంద్ర బాబును టార్గెట్ చేయడానికి అసెంబ్లీని వాడుకుంటేనే బెటర్ అని జగన్కు ఫోన్ ద్వారా చెప్పినట్టు తెలిసింది. ఇక, ఈ విషయం ఎలా ఉన్నా.. తన అనుభవంతో ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని ఇన్నాళ్లు చంద్రబాబు ఆడిన నాటకాలను అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టేందుకు జగన్ కు ఓ చక్కని చాన్స్ అని వైసీపీ సీనియర్లుసైతం అభిప్రాయపడుతున్నారు.
ముందు ప్రత్యేక ప్యాకేజీ బాగుందని కేంద్రానికి తీర్మానం చేసి పంపిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల సమయంలో హోదా కోసం పట్టుబట్టడం కుట్ర రాజకీయమేనన్న కోణాన్ని అసెంబ్లీలో కడిగి పారేయొచ్చని వైసీపీ సీనియర్లు భావిస్తున్నారు. అదేసమయంలో ఏపీలో జరుగుతున్న వరుస పడవ ప్రమాదాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధుల అవినీతిపై జనసేన అధినేత పవన్కల్యాణ్ కూడా గొంతెత్తుతున్నారు. నిన్నమొన్నటివరకూ టీడీపీతో కలిసిన ఉన్న బీజేపీ కూడా పట్టిసీమ ప్రాజెక్ట్లో అనినీతి జరిగిందని ప్రచారం చేస్తోంది. ఈ తరుణంలో టీడీపీ ప్రభుత్వం తీరుని ఎండగట్టడానికి అసెంబ్లీని వేదికగా చేసుకుంటే బాగుంటుం దనీ, తమకు మంచి మైలేజీ వస్తుందనీ వైసీపీ శాసనసభ్యులు భావిస్తున్నారు.
ఈ దఫా అసెంబ్లీ సమావేశాల తేదీ ప్రకటించిన వెంటనే జగన్తో మాట్లాడతామనీ, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అంశంపై చర్చిస్తామనీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆఫ్ ది రికార్డుగా మీడియా నేతలతో చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అదినేత.. గతంలో తాను చేసిన వాదనను పక్కకు పెట్టి.. చంద్రబాబును కడిగేయడానికి అసెంబ్లీ ని వాడుకోవాలని భావిస్తున్నట్టు తాజా సమాచారం. మరి కొద్ది నెల్లలోనే ఎన్నికలు ఉండడం, ప్రస్తుతం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారనే విపక్షాల విమర్శల నేపథ్యంలో జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లాలనే నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం పాదయాత్ర ఇంకా చేయాల్సి ఉండడం, సెప్టెంబరు 2వ తేదీ వరకు పాదయాత్ర షెడ్యూల్ ఉండడంతో సభకు వెచ్చించాల్సిన సమయంపై ఆయన ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.
ఒకవేళ తాను పాదయాత్రలోనే ఉన్నా.. తన తరఫున గట్టిగా మాట్టాడేందుకు బలమైన గొంతులను ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే రాచమల్లు, కోటంరెడ్డి, చెవిరెడ్డి వంటి వారిని సభలో మాట్లాడించి చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, ప్రధాన చర్చకు మాత్రం తానే స్వయంగా హాజరైతే బాగుంటుందని మాజీ ఎంపీ మేకపాటి సూచించినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.