చంద్రబాబునాయుడువన్నీ ఉత్త మాటలేనని కేంద్రప్రభుత్వం తేల్చేసింది. హై కోర్టు ఏర్పాటుకు సంబంధించి తాజాగా సుప్రింకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో రాష్ట్రప్రభుత్వం సహకరించటం లేదని చెప్పింది. హై కోర్టు ఏర్పాటుకు ముందుకు రావటం లేదన్నది. ఏపిలో హై కోర్టు ఏర్పాటు విషయంలో రాష్ట్రప్రభుత్వం ఈరోజు వరకూ సంసిద్దత వ్యక్తం చేయలేదని స్పష్టం చేసింది.
ప్రత్యేక హైకోర్టుకు ఒత్తిడి
ఒకవైపేమో ఏపిలో హైకోర్టు ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని, అవసరమైన అన్నీచర్యలూ తీసుకుంటున్నట్లు చంద్రబాబు ఎప్పటి నుండో చెబుతున్నారు. హైకోర్టు ఏర్పాటు పేరుతో ఓ కమిటి కూడా వేశారు. మరి ఆ కమిటి ఏం చేస్తోందో ఎవరికీ తెలీదు. ఇంకోవైపేమో హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి హై కోర్టును తమకు అప్పగించేయాలంటూ తెలంగాణాలోని న్యాయవాదులు ఎప్పటి నుండో గోల పెడుతున్నారు. అధికార టిఆర్ఎస్ కూడా వారికి పూర్తిస్ధాయిలో మద్దతుగా నిలబడుతోంది.
కమిటి ఏం చేస్తోంది ?
ఇటువంటి సమయంలోనే ఒత్తిడి తట్టుకోలేక ఏపి ప్రభుత్వం హై కోర్టు ఏర్పాటుకు ఓ కమిటిని వేస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలను పరిశీలించమని కూడా ప్రభుత్వం కమిటికి చెప్పింది. సరే, ఆ పనులన్నీ ఎంతవరకూ వచ్చాయో బయట వ్యక్తులకు తెలీదనుకోండి అది వేరే సంగతి. అయితే, పునర్వవస్ధీకరణ చట్టం అమలుపై తెలంగాణా కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. ఆ సందర్భంలో కేంద్రం తాజాగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
రాష్ట్ర వైఖరిని స్పష్టం చేసిన కేంద్రం
కౌంటర్ అఫిడవిట్ ప్రకారం హైకోర్టు ఏర్పాటుకు ఏపి ప్రభుత్వం ముందుకు రావటం లేదు. ఒక రాష్ట్రంలో హై కోర్టు ఏర్పాటుకు అవసరమైన నిర్వహణ వ్యయాన్ని అందించటం రాష్ట్రప్రభుత్వ బాధ్యతగా తెలిపింది. అదేవిధంగా కోర్టులో రోజువారి పాలన చూడటం హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతగా తెలిపింది. కాబట్టి హైకోర్టు ఏర్పాటులో కేంద్రం ఏకపక్షంగా చేయటానికి ఏమీ లేదని తేల్చేసింది కేంద్రం. తాజాగా కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో రాష్ట్రప్రభుత్వ సహాయనిరాకరణను స్పష్టంగా తెలిపింది.