కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నువ్వా.. నేనా అన్నట్లు ఫలితాలు వస్తున్నాయి. అయితే ఇక్కడు కింగ్మేకర్ మాత్రం జేడీఎస్సేనని ఫలితాల సరళితో తేలిపోతోంది. పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్పోల్స్ నిజమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరకు కాంగ్రెస్ పార్టీ 80స్థానాల్లో, బీజేపీ 85 స్థానాల్లో, జేడీఎస్ 30 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఈ ఫలితాల సరళిని బట్టి చూస్తే ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా పూర్తి మెజారిటీ రాదని తెలుస్తోంది.
దీంతో మొదటి నుంచి చెబుతున్నట్లుగానే జేడీఎస్ కింగ్మేకర్ పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. అయితే మేఘాలయ, గోవాలో ఎదురైన అనుభావాల్ని ద`ష్టిలో పెట్టుకుని ఆదివారం సాయంత్రానికి కాంగ్రెస్ అగ్రనేతలు బెంగళూరు చేరుకున్నారు. గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ తదితర అగ్రనేతలందరూ అక్కడికి చేరుకుని అప్పుడే మంతనాలు మొదలుపెట్టారు. పై రెండు రాష్ట్రాల్లో ఎక్కువసీట్లు సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ విఫలం చెందింది. తక్కువ సీట్లు గెలిచిన బీజేపీ ఇతరులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అయితే కర్ణాటకలో ఇలాంటి పరిస్థితి రావొద్దని అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ జేడీఎస్ నేతలు దేవేగౌడ, కుమారస్వామితో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా... కింగ్మేకర్ పాత్ర పోషించే కంటే... కింగ్ కావడమే లక్ష్యంగా జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పట్టుబడుతారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జేడీఎస్కు ఎంఐఎం మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
జేడీఎస్ నుంచి పోటీ చేసిన ముస్లింలు ఎంతమంది గెలుస్తారన్నది కూడా మద్దతుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జేడీఎస్ నుంచి ఎక్కువమంది ముస్లింలు గెలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే జేడీఎస్ మద్దతు విషయాన్ని కాసేలా అలా ఉంచితే.. ముఖ్యమంత్రి ఎవరన్నది మాత్రం మరింత ఉత్కంఠ రేపుతోంది.