అవును! తెలంగాణలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలని చూస్తున్నా.. తెలంగాణ సీఎం కేసీఆర్కు అన్ని వైపుల నుంచి సెగలు పొగలు కక్కుతున్నాయి. విపక్షాల వ్యవహారం మామూలే అనుకున్నా.. సొంత పార్టీలోనే అసమ్మతి గళం విప్పుతోంది. పార్టీ పదవుల విషయంలోను, ప్రభుత్వ పదవుల విషయంలోను తీవ్ర అసమ్మతి గజ్జె కట్టి ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఇక, జిల్లాల్లో వలస నేతలు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నేతలకు మధ్య ఆధిపత్య ధోరణి పెరిగి.. అది కూడా తీవ్ర వివాదానికి కారణమవుతోంది. కొన్నిచోట్ల టీఆర్ ఎస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
మరికొన్ని చోట్ల ప్రభుత్వంలోని పలు విషయాలను ముందుగానే విపక్షాలకు లీకులు ఇస్తున్నారు అధికార పార్టీ టీఆర్ ఎస్ నేతలు. సొంత మేనల్లుడు,మంత్రి హరీష్ రావును కూడా కేసీఆర్ పక్కన పెట్టారనే విమర్శలు మిన్నంటడం తెలిసిందే. అనేక ప్రముఖ కార్యక్రమాల్లో ఆయన పాత్ర లేకుండా చేశారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో అధికార పక్షం సహా సీఎం కేసీఆర్పై విమర్శల వివాదాలు చుట్టుముట్టాయి. ఇంత జరిగిన కేసీఆర్కు పెద్ద బాధగా అనిపించడం లేదు. కానీ, అధికార పార్టీలో అత్యంత సీనియర్గాను, కేసీఆర్ కు రైట్ హ్యాండ్ గాను, మంత్రిగాను వ్యవహరిస్తున్న కేసీఆర్కు అత్యంత నమ్మకస్తుడు నాయిని నరసింహారెడ్డి .. తాజాగా ప్రభుత్వం సహా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై బహిరంగంగానే విమర్శలు సంధించేశారు.
తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారికి అప్పట్లో పోరాటంలో లేని వారికి కేబినెట్ లో కీలక మంత్రి పదవులు కట్టబెట్టారని నాయిని విమర్శించారు. ఇలా చేయడం ద్వారా బంగారు తెలంగాణకు ద్రోహం జరిగిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఊహించని రాజకీయ పరిణామం నిజంగా కేసీఆర్ కు ఊపిరి సలపనివ్వదని అంటున్నారు పరిశీలకులు.
ఇక, నాయిని విమర్శలకు పార్టీలోని అన్ని పక్షాల నుంచి మద్దతు పెరుగుతోంది. అంటే కేసీఆర్ పట్ల ధిక్కార స్వరాలు ఏకీకృతం అవుతున్నాయి. మొత్తంగా విపక్షాలు చేయాల్సిన విమర్శలను అంతకు మించి ప్రభుత్వం కేంద్రంగా చేస్తున్న విమర్శలను కేసీఆర్కు గొడ్డలిపెట్టుగానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.