దీపావళి తరవాత కూడా కర్నూలు టీడీపీ లో దీపావళి టపాసులు పేలుతున్నాయి. వైకాపా ఎంపీ బుట్టా రేణుక తో అ నియోజికవర్గాల్లో, జిల్లాల్లో వారేమీ పండుగ చేసుకోవడం లేదు. ఆమె పార్టీ లోకి రావడం వలన లాభం ఎంత అనేది చంద్రబాబు లెక్కేసుకుంటూ ఉంటె తమ గొయ్యి పరిస్థితి ఏంటి అని తెలుగు తమ్ముళ్ళు తెగ పిసుక్కుంటున్నారు.
రేణుకను ఏ ఉద్దేశంతో చేర్చుకునేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదే క్రమంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మీద కర్నూలు జిల్లా టీడీపీ వర్గాలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం! బుట్టా రేణుక టీడీపీలో చేరితే… మధ్యలో ఈయనపై ఆగ్రహం ఎందుకూ అనుకుంటున్నారా..? అసలైన వ్యవహారం తెరవెనుక ఆయనే నడిపించారట! అవును టీడీపీ లోకి రేణుక రావడం అనేది సడన్ గా జరిగిన విషయం ఏమీ కాదు 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆమె రావాలని డిసైడ్ అయ్యారు.
ఏపీ లో టీడీపీ అధికారం లోకి రాగానే వెంటనే ఎస్పీ వై రెడ్డి టీడీపీ లోకి చేరిపోయారు, అదే టైం లో రేణుక ఆమె వెంటే ఉన్నారు . కానీ సాంకేతికంగా మాత్రం ఇన్నాళ్ళూ వైకాపా తోనే ఉన్నారు ఆమె. సరిగ్గా ఎన్నికలకి ఏడాదిన్నర ఉంది అన్న టైం లో ఆమె ప్లేటు ఫిరాయించారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆమెకే అని చంద్రబాబు హామీ ఇవ్వడంపై కర్నూలు టీడీపీ వర్గాలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
బుట్టాను పార్టీకి చేరువ చేయడంలో కీలకపాత్ర పోషించిన నాయకుడు.. సీఎం రమేష్. ఆయనే దగ్గరుండి మంత్రాంగం నడిపారు! ఇప్పుడిప్పుడే కాస్త బలపడుతున్న కర్నూలు జిల్లా టీడీపీలోకి రేణుకను తెచ్చి, సీఎం రమేష్ కొత్త చిచ్చుకు కారణం కాబోతున్నారంటూ తెలుగు తమ్ముళ్ళు సీఎం రమేష్ మీద యమా సీరియస్ గా ఉన్నారు.