అమరావతి : జగన్ ప్రభుత్వంపై వీర్రాజు ఓవర్ యాక్షన్

Vijaya



బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చేసిన ఆరోపణలు చూస్తుంటే అలాగే ఉంది. గుంటూరులోని ఏటీ అగ్రహారం పేరును ఫాతిమా నగర్ గా ప్రభుత్వం మార్చిందట. దాన్ని వీర్రాజు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఫాతిమా నగర్ అన్న పేరును తీసేసి మళ్ళీ ఏటీ అగ్రహారమని పెట్టాలంటు డిమాండ్ చేశారు. ఇంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువులను అణగదొక్కేస్తున్నారట. ముస్లింలు, క్రిస్తియన్లకు అన్నింటిలోను పెద్దపీట వేస్తున్నట్లు మండిపోయారు.



ఇక్కడే వీర్రాజు ఓవరాక్షన్ బయటపడింది. గుంటూరులోని ఒక కాలనీ పేరు మార్చటంలో ప్రభుత్వానికి ఏమి సంబంధం. కాలనీ పేరుమార్చాలంటే కాలనీలో నివసించే జనాల నుండి అభ్యర్ధలను వచ్చుండాలి. లేదా ఇంకెవరైనా చేసిన ప్రతిపాదనకు జనాలు సానుకూలంగా స్పందించుండాలి. ఇదంతా మున్సిపాలిటి లెవల్లో జరిగిపోతుంది. ఇలాంటి పేరు మార్పిడి వ్యవహారాలతో జగన్ కు ఏమి సంబంధం ? అసలక్కడ ఉన్న పేరేమిటి ? మార్చిన పేరేమిటి అన్న విషయం కూడా జగన్ కు తెలిసుండదు.



అయినా కేంద్రంలో అధికారాన్ని చూసుకుని రాష్ట్రంలో బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారు. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం పెట్టాలని మున్సిపల్ కౌన్సిల్, ఎంఎల్ఏ నిర్ణయం తీసుకుంటే ఎంత గొడవ చేశారో అందరికీ తెలిసిందే. టిప్పుసుల్తాన్ విగ్రహం పెట్టాలని టిప్పు భార్య తరపు వాళ్ళు అభ్యర్దించారు. ఎందుకంటే టిప్పు భార్యల్లో ఒకళ్ళది ప్రొద్దుటూరట. అందుకనే వాళ్ళనుండి వచ్చిన అభ్యర్ధనను కౌన్సిల్ అంగీకరించింది.



ఇక గుంటూరులోనే ఉన్న జిన్నా టవర్ పేరు మార్చకపోతే టవర్ను కూల్చేస్తామని ఎంత గోలచేశారో గుర్తుండే ఉంటుంది. చివరకు ఆ టవర్ కు భారత జాతీయ జెండా రంగలు వేసిన తర్వాతే  వీళ్ళ గోల ఆగింది. అక్కడా ఇక్కడా గోలచేసేబదులు కర్నాటకలో అధికారంలో ఉన్నది బీజేపీనే కదా. మైసూరులోని టిప్పుసుల్తాన్ ప్యాలెస్ ను కూల్చేసుండచ్చు కదా. ఢిల్లీలో ఎన్నో ప్రాంతాలకు, రోడ్లకు, భవనాలకున్న ముస్లిం పేర్లను మార్చమని నరేంద్రమోడీని ఎప్పుడైనా డిమాండ్ చేశారా ? తమచేతిలో ఉన్న పనులు చేయకుండా ఏపీలో మాత్రం ముస్లిం నాన్ ముస్లిం అని ఉద్రిక్తలు రెచ్చగొడుతున్నారు వీర్రాజు అండ్ కో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: