హైదరాబాద్ : తెలంగాణా కాంగ్రెస్ చీలిపోయిందా ?

Vijaya


తెలంగాణా కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొదటినుండి పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువనే చెప్పాలి. కానీ ఈమధ్య జరుగుతున్న పరిణామాలు మాత్రం విచిత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత నుండి సీనియర్లలో చాలామంది ప్రత్యేక గ్రూపుగా చెలామణి అవుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్ధితి ఉండేదికాదు. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో అందరు కలిసే పాల్గొనేవాళ్ళు.



అయితే రేవంత్ పగ్గాలు అందుకున్న దగ్గర నుండి పరిస్ధితి మారిపోయింది. ఇపుడిదంతా ఎందుకంటే ఒకవైపు రేవంత్ పాదయాత్ర చేస్తుంటే మరోవైపు మహేశ్వరరెడ్డి భైంసాలో శుక్రవారం పాదయాత్ర మొదలుపెట్టారు. మహేశ్వర్ మొదలుపెట్టిన పాదయాత్రకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర్ రాజనర్సింహ, కోదండరెడ్డి, మదన్ మోహన్ రెడ్డి లాంటి సీనియర్లు మద్దతిచ్చారు. వీళ్ళెవరూ రేవంత్ చేస్తున్న పాదయాత్రలో ఇప్పటివరకు పాల్గొనలేదు.



తాజా పరిణామాలతోనే పార్టీ రెండుగా చీలిపోయిందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఈమధ్యనే పార్టీలో వేసిన కమిటీల విషయంలో కూడా ఇలాగే జరిగింది. పార్టీ బలోపేతానికి అధిష్టానం మూడు కమిటీలు వేసింది. అయితే కమిటీల్లో కాంగ్రెస్ నేతలకన్నా రేవంత్ తో వచ్చిన వలసనేతలే ఎక్కువమంది ఉన్నారనే గోల మొదలైంది. దీంతో కమిటీల్లో మార్పులు చేసేంతవరకు తాము రేవంత్ కు సహకరించేదిలేదని సీనియర్లలో చాలామంది తీర్మానించారు. రేవంత్ పాల్గొనే ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనకూడదని డిసైడ్ చేశారు.



ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. మరోవైపు నేతల మధ్య కీచులాటలు పెరిగిపోతున్నాయి. ఇపుడే ఇలాగుంటే రేపు టికెట్ల కేటాయింపులో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే. పార్టీలో ఇన్ని గొడవలు పెట్టుకుని రేపటి ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది కాంగ్రేసే అని రేవంత్ చెబితే ఎవరైనా నమ్ముతారా ? టికెట్ల కేటాయింపు సమయంలో పార్టీలో  మరిన్ని చీలికలు రావటం ఖాయం. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధులు పోరాడాల్సిందే ప్రత్యర్ధి పార్టీలతో కాదు పార్టీలోని ప్రత్యర్ధి నేతలతోనే. కాంగ్రెస్ పార్టీ ఇంతే ఎప్పటికి మారదంతే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: