హైదరాబాద్ : గెలుపుకోసం కేసీయార్ మాస్టర్ ప్లాన్

Vijaya






గెలుపు ఎప్పుడు సమస్య అనుకున్నా వెంటనే కేసీయార్ కు గుర్తుకొచ్చేది సీమాంధ్రులే. అవసరం ఉన్నంతవరకు కేసీయార్ తెలంగాణా సెంటిమెంటును పైకి తీస్తారు. సీమాంధ్రులను తిట్టిపోస్తారు. దాంతో తెలంగాణా జనాలు కూడా సెంటిమెంటుకు పడిపోయి టీఆర్ఎస్ కు ఓట్లేసేస్తారు. టీఆర్ఎస్ కే ఎందుకు ఓట్లేస్తారంటే కాంగ్రెస్, బీజేపీలు కూడా కేసీయార్ దృష్టిలో తెలంగాణా సమాజానికి ద్రోహంచేసే పార్టీలే కాబట్టి.



కేసీయార్ మాటలు, మాయలు జనాలు నమ్మినంతకాలం టీఆర్ఎస్ కు ఓట్లేస్తారు. మొన్నటి రెండు ఎన్నికల్లో జరిగిందిదే. మరి వచ్చే ఎన్నికల పరిస్ధితి ఏమిటి ? ఏముంది మళ్ళీ సెంటిమెంటును జనాలమీదకు వదలటమే. ఇపుడు కేసీయార్ చేస్తున్నదిదే. కాకపోతే తాను డైరెక్టుగా సీమాంధ్ర గురించి మాట్లాడకుండా మంత్రి హరీష్ రావుతో మాట్లాడిస్తున్నారు. ఇంతకుముందు ప్రశాంతరెడ్డితో కూడా ఇలాగే మాట్లాడించారు. కొందరు మంత్రులు నోరిప్పితే సీమాంధ్రుల మీద విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారు. మరో మంత్రి గంగుల కమలాకర్ అయితే ఏకంగా సీమాంధ్రుల మీద దాడులే చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.



రాష్ట్రం సమైక్యంగా ఉన్నంతవరకు తెలంగాణా ప్రాంతంలో అభివృద్ధే జరగలేదట. ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాతే దేశం మొత్తంమీద అభివృద్ధిలో నెంబర్ 1 గా నిలుస్తోందంటు ఒకటే ఊదరగొడుతున్నారు. వీళ్ళు చెప్పేదాంట్లో ఎంత నిజముందో జనాలకు తెలీందేమీ కాదు. అందుకనే వీళ్ళ మాటలను జనాలు పట్టించుకోవటంలేదు. ఈ విషయం గ్రహించే పదే పదే సీమాంధ్రులను చులకనగా మాట్లాడుతున్నారు. ఎలాగైనా సరే ఏపీలో జనాలను రెచ్చగొట్టాలి తెలంగాణాలో పబ్బం గడుపుకోవాలన్నదే తెలంగాణా మంత్రుల ఆలోచనగా తెలుస్తోంది.




తొందరలో జరగబోయే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపుకోసమే మంత్రుల గోలంతా. ఇదంతా కేసీయార్ పక్కా వ్యూహంతోనే జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది. కేసీయార్ డైరెక్టుగా ఎందుకు మాట్లాడటంలేదంటే తొందరలోనే జాతీయపార్టీ పెడతానంటున్నారు కదా మరి ఏపీలో కూడా మద్దతు అవసరం కదా. అందుకనే తాను మాట్లాడకుండా మిగిలిన వాళ్ళతో మాట్లాడిస్తున్నది. మునుగోడులో తన సెంటిమెంటు  వ్యూహం వర్కవుటైతే కచ్చితంగా తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో కూడా అదే సెంటిమెంటును ప్రయోగిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: