ఖమ్మంలోనూ మంకీపాక్స్.. తెలంగాణలో కలకలం..
ఇప్పటికే మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపు వంద దేశాలకు ఇది విస్తరిస్తోంది. కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోందని అంటున్నారు. ఈ దశలో ఇటీవలే మంకీపాక్స్ భారత్ లో కూడా ఎంటరైనంది. మొదటగా కేరళలో ఇద్దరికి మంకీపాక్స్ నిర్థారణ అయింది. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కూడా మరో కేసు నమోదైంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇది విస్తరించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ముందుగా కామారెడ్డి, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో అనుమానిత లక్షణాలతో ఇద్దరు ఆస్పత్రిలో చేరడంతో కలకలం రేగింది.
మంకీపాక్స్ లక్షణాలు కనపడితే ఇప్పుడు చాలామంది హడలిపోతున్నారు. జ్వరంతోపాటు ఒంటిపై దద్దుర్లు, దురద వంటి లక్షణాలు కనపడితే మాత్రం ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు కూడా అంతే హడావిడి పడుతున్నారు. వెంటనే ప్రభుత్వ వైద్యులకు సమాచారమిస్తున్నారు. జిల్లా అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. దీంతో అటు అధికారులు కూడా ముందు జాగ్రత్తగా మంకీపాక్స్ లక్షణాలున్నవారి వద్ద శాంపిల్స్ తీసుకుంటున్నారు. శాంపిల్స్ సేకరించి వాటిని హైదరాబాద్ లోని ఫీవర్ ఆస్పత్రికి పంపిస్తున్నారు. దాంతోపాటు పుణెలోని వైరాలజీ ల్యాబ్ కి కూడా ఆ శాంపిల్స్ పంపిస్తున్నారు. ఆ శాంపిల్స్ నుంచి అధికారిక సమాచారం వస్తే కానీ తెలంగాణలో మంకీపాక్స్ నిర్థారణ కాదు. ఇప్పటి వరకూ కేవలం అనుమానితులే ఉన్నారు. అయితే ఆ అనుమానాలతోనే తెలంగాణలో కలకలం రేగింది.