కొడాలి నాని - జగన్ భేటీ.. అసలు కారణం ఏంటి..?
మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్నారు కొడాలి నాని. మాజీ మంత్రిగా కంటే, ఎమ్మెల్యేగా పిలిపించుకోవడమే తనకి ఇష్టమని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు నాని. సీఎం జగన్ తో సమావేశం అయిన తర్వాత ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు.
చంద్రబాబు అబద్ధాల కోరు, మోసగాడంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఎవరెవరు కలసి వచ్చినా, ఎన్ని గ్రూపులు వచ్చినా.. సింహం రెడీగా ఉందని, వారందర్నీ చెల్లాచెదురు చేస్తుందని అన్నారు నాని. వైసీపీకి ఉన్న 50 శాతంపైగా ఓట్లు అలాగే ఉన్నాయని, 2024 ఎన్నికల్లో కూడా వైసీపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. జగన్ నే మళ్ళీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారని జోస్యం చెప్పారు.
2019లో మహిళలంతా తనకే ఓటు వేశారని చంద్రబాబు చెప్పుకున్నారని, అదే బాబు ఇప్పుడు జగన్ కు వ్యతిరేకత ఉందని చెబుతున్నారని అన్నారు నాని. జగన్ పై వ్యతిరేకత ఉంటే చంద్రబాబు సింగిల్ గా పోటీ చేసినా గెలుస్తారని, ఆయనకు మరో పార్టీ అవసరం ఎందుకొచ్చిందని నిలదీశారు. వైసీపీని ఓడించాలంటే, జగన్ ని గద్దె దించాలంటే.. ముందు పవన్, లోకేష్ ఎమ్మెల్యేలుగా గెలవాలి కదా అని సెటైర్లు విసిరారు నాని.