మేడారానికి కేసీఆర్, కిషన్రెడ్డి.. ఇవాళే కీలక రోజు..!
మేడారంలో సమ్మక్క, సారలమ్మ మహాజాతర మహా వైభవంగా సాగుతోంది. గద్దెల వద్దకు దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇవాళ మేడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. దీంతో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. రేపటి వరకు మేడారం మహాజాతర ఉత్సవాలు కొనసాగుతాయి. రేపు సమ్మక్క, సారలమ్మ దేవతల వనప్రవేశం ఉంటుంది. ఇవాళ మేడారం జాతరకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా వెళ్లనున్నారు. ఆయన వనదేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకోనున్నారు. ఇవాళ మేడారం మహాజాతరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వెళ్తున్నారు. ఆయన వెంట బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సునీల్ ఓరాన్ కూడా వెళ్తారు. వీరంతా బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్తారు.
రెండేళ్లకోసారి సాగే ఈ మహా జాతర కోలాహలంగా సాగుతోంది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ఈ సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు పేరుంది. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఈ జాతర జరుగుతోంది. ఈనెల 19న మొదలైన ఈ నాలుగు రోజుల జాతర రేపటితో ముగియనుంది. తొలిరోజు కన్నెపల్లి నుంచి గద్దెలపైకి సారలమ్మ రాకతో భక్తుల సంబరాలు ప్రారంభమయ్యాయి. నిన్న మరో వన దేవత సమ్మక్క.. రేపు గద్దెలపైకి చేరుకుంది. మేడారం మహాజాతరకు ప్రభుత్వం రూ.75 కోట్లు వరకూ ఖర్చు చేసింది. ఈ జాతర కోసం పారిశుద్ధ్య నిర్వహణకు 2,500 కార్మికులు పని చేస్తున్నారు. 650 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పని చేస్తున్నారు. మేడారం జాతర కోసం 6 వేల తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయి. టీటీడీ కల్యాణమండపంలో 50 పడకల ఆస్పత్రి కూడా ఏర్పాటు చేశారు. మేడారం పాఠశాలలో మరో 10 పడకలతో అత్యవసర ఆస్పత్రి ఏర్పాటు చేశారు.