వారెవ్వా: మోపిదేవి వారసత్వ రాజకీయం!?
నిజానికి మోపిదేవి వెంకటరమణ వై.ఎస్.కుటుంబానికి సన్నిహితుడు. రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఆయన రెండు సార్లు ఓటమి చెందారు. అయినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. మోపిదేవి వెంకటరమణకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. తర్వాత ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించి రాజ్యసభకు పంపారు. ఈ పరిణామాలతో ఇక మోపిదేవికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు భావించాయి. ఇక ఇదే సమయంలో రేపల్లె ఎమ్మెల్యే సీటు వేరే వారికి పోతుందని ఆయన గ్రహించారనీ, అందుకే ముందస్తుగా తన కుమారుడు రాజీవ్ను రాజకీయ రంగ ప్రవేశం చేయించే పనిలో పడ్డారనీ చర్చ జరుగుతోంది. ఇందుకు కుమారుడి జన్మదిన వేడుకను వేదికగా చేసుకున్నారని వినికిడి.
అయితే అన్న తర్వాత తానేనని మోపిదేవి హరనాథబాబు కూడా ఊహల్లో ఉన్నారట. కానీ ఆయన అన్న మోపిదేవి వెంకటరమణ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ... తన రాజకీయ చతురతను ప్రదర్శించారని, తన తమ్ముడి చేతే తన కుమారుడిని మోపిదేవి వారసుడు అని ప్రకటింపజేశారని రాజకీయ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. మొత్తానికి మోపిదేవి వారసత్వ రాజకీయం చేశారని స్వపక్షీయుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.