ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్లందరిని ఒకే వేదికపై చేర్చేందుకు ప్రయత్నాలు వేగంగా, పకడ్భందీగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒక్కో పావు కదుపుతున్నారు. ఫైనల్ అభ్యర్థిగా ఎవరిని ఉంచాలి, ఎవరిని పోటీ నుంచి తప్పించాలి అన్న విషయంపై కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీంట్లో భాగంగా కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్న నేపథ్యంలో పది మంది అభ్యర్థులు ఇప్పటికే పోటీలో ఉన్నారు. వీళ్లలో ఎల్.రమణ, భానుప్రసాద్ రావు అధికార టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండగా, 8 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇవ్వాలనే యోచనలో ఈటల ఉన్న విషయం తెలిసిందే. ఇక దీంట్లో భాగంగానే అభ్యర్థులందరినీ ఒకే వేధికపై తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఎనిమిది మంది అభ్యర్థులు ఎవరికి వారు పోటీ చేస్తే.. ఓట్లు చీలి అధికార పార్టీ అభ్యర్థులకు లాభం చేకురుతుంది. దీంతో ఒకే అభ్యర్థిని ప్రకటించినట్టయితే అన్నివిధాలా లాభం చేకూరుతుందని అనుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు లోకల్ బాడీ నేతల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని స్పష్టం అవుతోంది.
దీన్ని సానుకూలంగా మల్చుకున్నట్టు అయితే గనుక ఒక స్థానంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించే అవకాశాలు మెండుగా ఉన్నట్టు ఈటల భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఈటల రాజేందర్ సమీకరణలు చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 8న ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించి, ఓట్లు అభ్యర్థించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాను ఎవరికి మద్ధతు ఇస్తున్నానోని ఈటల మీడియా ముఖంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో తనకు మద్ధతు ఇచ్చి ఆశీర్వదించాలని మంథని కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎనుముల సతీష్ ఈటల రాజేందర్ను కలిసి అభ్యర్థించారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఎవరివైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.