ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కేసీఆర్ ఎత్తులు ఫలించలేవా..?
డిసెంబర్ 10వ తేదిన ఎన్నిక జరగనుండగా.. 14 వ తేదిన లెక్కింపు జరగనుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన రెండు స్థానాలు మినహా రెండు మిగిలిన 10 స్థానాలు ఏకగ్రీవం చేసుకోవాలని అధికార గులాబీ పార్టీ భావించింది. అయితే, ఆరు స్థానాలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. 4 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు షాక్ ఇచ్చారు. అభ్యర్థుల ఎంపికలో అసంతృప్తి టీఆర్ఎస్ పార్టీని కుదిపేస్తోంది. దీనికి తోడు ప్రభుత్వంపై ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలతో ఆ అసంతృప్తి బయటపడింది. ఎంపీటీసీలు ముఖ్యమైన ఆరు డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఎంపీటీసీల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలాగే.. జడ్పీటీసీలు కూడా పలు విజ్ఞప్తులను ప్రభుత్వం ముందు ఉంచారు. ఇవి బుట్టదాఖలు కావడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు వేసి తమ అసంతృప్తిని బహిర్గత పరిచారు. ముఖ్యంగా కరీంనగర్లో మాజీ మేయర్ రవీందర్ సింగ్ నామినేషన్ వేయడంతో గులాబీ పార్టీకి షాక్ తగిలింది.
మెదక్, ఖమ్మం తప్పా టీఆర్ఎస్ అభ్యర్థులు స్వతంత్రులతో పోటీ పడుతోంది. బలాబలాలు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నందున ఏకగ్రీవం అవుతుందనుకుంటే పరిస్థితి రివర్స్ అయింది. బుజ్జగింపులు, క్యాంపు రాజకీయాలు చేయాలనుకున్నా చివరికి అవి కుదరలేదని తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ ఎత్తులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.