ఫ్యాన్ ఆంధ్రా : క్రూర గాయలు సర్..బాధ మరియు భయము
ధరల నుంచి మాత్రం మోక్షం దక్కడం లేదన్నది ఓ వాస్తవం
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కానీ స్టాలిన్ కానీ కొన్ని చర్యలు
వినియోగదారులకు అనుకూలంగా వారి బాధలను తగ్గించేందుకు
నిర్ణయాలు వెలువరించారు.. దీంతో కొంతలో కొంత
ధరలు దిగివస్తే.. సామాన్యుడికో ఊరట.. లేదంటే అవి క్రూరగాయలే!
మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని చెప్పడం బాధ..అవి కొనేందుకు వెళ్లేటప్పుడు సామాన్యుడి గుండె దడ పెరిగిపోతోంది అని చెప్పడం భయం. ఎందుకంటే ఒకప్పటిలా కూరగాయల ధరలు ఏవీ అందుబాటులో లేవు అని చెప్పడం బాధ. అందుకు ప్రభుత్వాలు కూడా ఓ కారణం అని చెప్పడం ఇంకొంత విచారం. ఈ తరుణాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగుమతులపై దృష్టి సారించడం, సరకు రవాణాకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇవ్వడం, కూరగాయలు రవాణాకు సంబంధించి పనిచేస్తున్న వ్యాపార వర్గాలకు వెసులుబాటు ఇవ్వడం, పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించడం, పంట చేనులో ఉండగానే కొనుగోలు చేసే విధానం ఒకటి ఏర్పాటు చేయడం చేస్తే కాస్తయినా సంబంధిత ధరవరలు దిగివస్తాయి. ఇవేవీ చేయకుండానే ధరలపై తాము పోరు సాగిస్తామని, వాటిని సాధ్యమయినంత మేర తగ్గిస్తామని బీరాలు పలకడం మాత్రం మన నాయకులకు వచ్చు. ఇంతటి అననుకూల పరిణామాల నేపథ్యంలో కూడా కొంతలో కొంత ఏపీ సర్కారు కొన్ని నిర్ణయాలు తీసుకుని, మార్కెట్ లో ధరల పెరుగుదలకు సంబంధించి నెలకొన్న విపరీత పోకడలను నియంత్రించేందుకు ముందుకు రావడం ఓ విధంగా శుభ పరిణామం. ఇదే విధంగా ఇంకొన్ని చర్యలు త్వరితగతిన తీసుకుంటే దళారీ వ్యవస్థను కట్టడి చేస్తే, ఆశించిన రీతిలో రైతుకు లాభం చేకూరడం సాధ్యం.
కార్తీక మాసం కారణంగా మార్కెట్లో కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. పూర్తిగా నాన్ వెజ్ అమ్మకాలు పడిపోయి, పవిత్ర మాసాన కూరగాయల కొనుగోళ్లు పెరిగిపోడంతో ఎన్నడూ లేని విధంగా విపరీతం అయిన డిమాండ్ నెలకొంది. కూరగాయల ధరలు ఇప్పటికిప్పుడు దిగివచ్చేలా లేవు. కానీ వాటిని నియంత్రించేందుకు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడిప్పుడే సఫలీకృతం అవుతున్నాయి. టమాట ధర సెంచరీ కొట్టింది. ఉల్లి కన్నీరెట్టిస్తోంది. నూనెలూ పప్పులూ ఉప్పులూ ఇలా అన్నీ సామాన్యుడికి అందనంత ఎత్తులోనే ఉన్నాయి. అందుకే వీటి నియంత్రణపై ప్రభుత్వాలు చేపట్టాల్సినన్ని చర్యలు చేపడితే కాస్తయినా అందరికీ అందుబాటులోకి వస్తాయి. జీతం డబ్బులు నెల నెల పెరగడం లేదు కానీ ధరలు మాత్రం ఏ పాటి కూడా కనికరం చూపడం లేదు అని విస్తుబోతున్నారు వినియోగదారులు. ఈ క్రమంలో అటు తమిళనాడు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ టమాటా ధరలు నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా సెంచరీ దాటేసిన టమాట ధర ఇకపై తమిళనాడులో 76 రూపాయలకు, ఏపీలో 60 రూపాయలకు అందుబాటులోకి రానుంది. ఇందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఇదే విధంగా మరికొన్ని నిత్యావసరాలపై కూడా దృష్టి సారిస్తే సంబంధిత ధరలు కూడా దిగివస్తాయి అన్నది మార్కెట్ నిపుణుల మాట.
శ్రీకాకుళంలో అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు
మార్కెట్ వివరం అనుసరించి
- టమాటాలు కేజీ ధర - 80 రూపాయలు
- ఉల్లిపాయలు కేజీ ధర - 40 రూపాయలు (ఎ గ్రేడ్)
- ఇంకో రకం 35 రూపాయలు
- బంగాళ దుంపలు కేజీ ధర - 20 రూపాయలు
- వంకాయలు కేజీ ధర - 50 రూపాయలు
- ఇంకో రకం - 60 రూపాయలు
- క్యారట్ కేజీ ధర - 60 రూపాయలు
- ఆ మధ్య కేజీ - 40 రూపాయలు కానీ
35 రూపాయలు కానీ ఉండేది
- అరటి కాయలు (మూడు) - 20 రూపాయలు
- కాకర కాయలు కేజీ ధర - 35 రూపాయలు
- దొండకాయలు కేజీ ధర - 60 రూపాయలు
- బెండ కాయలు కేజీ ధర - 60 రూపాయలు
- క్యాబేజీ పువ్వులు జత - పెద్దవి - 60 రూపాయలు
- చిన్నవి జత - 40 రూపాయలు
- ఆయిల్ ప్యాకెట్ (ఆధార్ ) లీటరు - 140 రూపాయలు
- ఇంకో రకం : పామాయిల్ లీటరు - 130 రూపాయలు
- కొబ్బరి కాయలు జత - 40 రూపాయలు