రెండు పార్టీలు ఒకే నాయకత్వం గొడుగులో ఉండడం అన్నదే దేశ చరిత్రలోనే ఓ విశేషం. అవి ఒకటి తెలంగాణ తెలుగుదేశం మరొకటి తెలంగాణ కాంగ్రెస్. ఫక్తు బాబు గారి ఏజెంట్ అయిన రేవంత్ ఇక్కడ ఇంటిని సర్దేసి లగేజీని గాంధీ భవన్ కు షిఫ్ట్ చేసేశాడు కానీ అక్కడ గబ్బిలాలు మాత్రం ఈ పిల్ల కాకి రాకను ఒప్పుకోవడం లేదు. ఇదే పెద్ద చిక్కు. ఈ ఒక్క చిక్కు వీడిపోతే తుది గెలుపు రేవంత్ కు మరియు బాబుకు అందడం ఖాయం మరియు తథ్యం కూడా!
తెలంగాణలో రెండు పార్టీలకు అతీగతీ లేకుండా పోయింది. ఒక్క చంద్రబాబు ఎఫెక్ట్ తో ఇవన్నీ తారుమారు అయిపోయాయి. దీంతో ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నాడు రేవంత్. ఏం చేయాలో తెలిసి ముందే జాగ్రత్త పడ్డాడు బీసీ నేత ఎల్ రమణ. రమణ కు ఉన్న సోయి కూడా రేవంత్ కు లేకపాయె! ఓటుకు నోటు కేసు మళ్లీ తవ్వితే రేవంత్ ఏమౌతాడు. పోనీ జగన్ రెడ్డే దగ్గరుండి తవ్వించిండు అనుకుందాం అప్పుడు ఏమౌతాడే! ఇదే ఇవాళ్టి లొల్లి. చంద్రబాబు ను నమ్ముకున్న పుణ్యానికి నిలువునా మునిగిపోయాడు రేవంత్. రేవంత్ ను నమ్ముకున్న పుణ్యానికో మరియు పాపానికో నిలువునా మునిగిపోనుంది చేతి గుర్తు పార్టీ. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు అని అంటున్నాడు రేవంత్. ఏం చేసినా కూడా సాధించేదేమీ లేదని చెబుతున్నాడు ఉత్తమ్.
బయటకు చెప్పకపోయినా లోలోపలి అంతర్మథనం మాత్రం ఇద్దరికీ ఇదే కావడం విశేషం. రేవంత్ ను నమ్మని కాంగ్రెస్ కూడా ఇప్పుడు తెలంగాణలో ఉంది. దీనిని కూడా ఎవ్వరూ కాదనరు కాదనలేరు కూడా! ఎందుకంటే సీనియర్లను రేవంత్ కలుపుకుని పోవాలన్న ఆలోచనలో ఉన్నా వారు మాత్రం అస్సలు కదిలేలా లేరు. కలిసి పనిచేసేలా కూడా లేరు. వారంతా పార్టీ పదవులనే ప్రభుత్వ పదవులుగా భావిస్తూ కాలం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే పార్టీ పదవుల్లో ప్రాధాన్యం లేకపోతే అలకబూనుతున్నారు. జగ్గారెడ్డి లాంటి ఫక్తు కాంగ్రెస్ వాదులు తమ అసంతృప్తిని బయటకు వెల్లడి చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. మధు యాసకీ లాంటి నేతలు రేవంత్ తో పనిచేసేందుకు సిద్ధం అవుతున్నా పాత కాలం వైఎస్ అభిమానులు ఇంకా రేవంత్ ను నమ్మడం లేదు. వీలుంటే వైఎస్సార్టీపీ కి మద్దతు ఇస్తే బాగుంటుంది అన్న యోచనలో కూడా వారున్నారు అని తెలుస్తోంది.