నిరసనకు కొత్త మార్గం ఏదయినా ఎంచుకున్నారా అంటే అదే నిజం అని అనిపిస్తోంది ఉద్యోగుల విషయమై.. కొత్త పీఆర్సీ ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వాధిపతి జగన్ కు వాళ్లు రివర్స్ లో కౌంటర్ ఇచ్చారు. దీంతో చాలా చోట్ల జగన్ సర్కారుకు సంబంధించి వాళ్లు వేసిన ఓట్లన్నీ చెల్లనివే అని తేలిపోయింది. ఓటేసినా కూడా డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా వెళ్లిపోయారు. ఇప్పటికే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో, ఆర్థిక సంబంధ ప్రయోజనాలు ఇవ్వడంలో జగన్ ఫెయిల్ అయ్యారు అన్న టాక్ ఉంది. ఆ మాటకు బలం ఇస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు తమ వ్యతిరేకతను కొన్ని చోట్ల చెప్పకనే చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసి చెల్లనివ్వకుండా చేసిన దాఖలాలు గతంలోనూ ఉండే ఉంటాయి కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఉద్యోగులు జగన్ కు బాకా ఊదారు. ఉద్యోగులు కోరుకున్న విధంగా 11వ పీఆర్సీ ఇస్తానని, సీపీఎస్ రద్దుకు కృషి చేస్తానని చెప్పిన జగన్ తరువాత క్రమంలో మాట తప్పారు.అదేవిధంగా కాంట్రాక్టు, ఔట్ సోర్టు ఉద్యోగుల విషయమై కూడా జగన్ సరిగా స్పందిచడం లేదు. కొన్ని చోట్ల కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి ఆరు నెలలుగా జీతాలే లేవు. ఇన్ని జరుగుతున్నా జగన్ వైఖరి మాత్రం సంక్షేమ జపమే!
జగన్ కూ ఉద్యోగులకూ మధ్య గ్యాప్ పెరిగిపోయింది అనేందుకు ఈ స్థానిక ఎన్నికల వివరాలే తార్కాణం. చాలా చోట్ల పోస్టల్ బ్యా లెట్ ను వినియోగించుకున్నప్పటికీ అవి చెల్లనివి అని తేలిపోయింది. బ్యాలెట్ పేపర్ లో్ ఓటు సరిగా వేసినా డిక్లరేషన్ ఫారం ఇవ్వ ని కారణంగా ఇవన్నీ చెల్లని ఓట్లే అని తేలిపోయాయి. అనంతపురం జిల్లా మడకశిరలో 11 ఓట్లు, విజయనగరం జిల్లా కొమరాడలో 47 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలయినా ఇవన్నీ చెల్లనివే అని తేల్చారు అధికారులు. దీంతో వైసీపీ వర్గాలు ఫలితం ఎలా ఉన్నా ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా ఉన్నారన్న విషయమై తర్జనభర్జనలు పడుతున్నారు.