తెలంగాణ మంత్రి హరీష్ రావు ఈ మధ్య దూకుడు పెంచారు. గ్రామాల్లో వరుస పర్యటనలు చేస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. నిజానికి హరీశ్ రావు గతంలోనూ తన నియోజకవర్గంలో ఎక్కువగానే పర్యటించినా ఇప్పుడు ఫోకస్ ను మరింత పెంచినట్టు కనిపిస్తుంది. ఇక తాజాగా ఆయన ఓ గ్రామంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాన్ని మార్చుకుని సాగు చేస్తే రైతుకు లాభాలు వస్తాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంతో గాలిలో తేమ శాతం పెరిగి ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా మారిందని వ్యాఖ్యానించారు. యాసంగిలో దేశంలో ఆత్యదికంగా వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ అని హరీష్ రావు చెప్పారు.
వరి పండించే వాళ్ళు ఎక్కువ అయ్యారని.. తినేవాళ్లు తగ్గారని అన్నారు. దాంతో వరి కి డిమాండ్ తగ్గుతుందని చెప్పారు. 60 వేల కిట్ల పామ్ ఆయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపారు. పామ్ ఆయిల్ సాగుతో సంవత్సరానికి లక్షా 20 వేలు రైతుకు మిగులుతాయని అన్నారు. పామ్ ఆయిల్ సాగు చేసే రైతుకు పెట్టుబడి, డ్రిప్ ఫ్రీగా ఇస్తున్నామని స్పష్టం చేశారు.. మీ తోటలో మీరు పని చేసుకుంటే ఉపాధి హామీ డబ్బులు కూడా చెల్లిస్తామని అన్నారు. పామ్ ఆయిల్ కు చీడ పీడ బాధ లేదని, కోతుల బెడద కూడా ఉండదన్నారు. రైతులు ఎంత పండించినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.
ఆయిల్ ఫామ్ దేశంలో 8.20 లక్షల ఎకరాలలో మాత్రమే సాగు అవుతున్నదని కానీ... దిగుమతి చేసుకోకుండా ఉండాలంటే 70 లక్షల ఎకరాల్లో సాగు పెరగాలని అన్నారు. రాష్టంలో 8.50 లక్షల ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాల సాగుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో అంతర పంటగా మిరియాలు, కాఫీ, వక్క పంటల సాగు కూడా చేసుకోవచ్చని తెలిపారు. రైతులు వరి లో వెదజల్లే పద్ధతిని అలవాటు చేసుకోవాలని.. సాధారణ పద్దతిలో కంటే వెదజల్లే పద్దతిలో పెట్టుబడి తక్కువగా ఉంటుందని హరీష్ రావు అన్నారు.