వామ్మో.. వచ్చే 72 గంటల్లో.. భయపెడుతున్న మెస్సేజ్..?

Chakravarthi Kalyan
వాట్సప్ వాడకం పెరిగాక ప్రజలను ఫేక్ మెస్సేజులు బాగా భయపెడుతున్నాయి. ఏది అసలో.. ఏదో ఫేకో తెలుసుకోలేని జనం.. ఈ మెస్సేజులు చదివి భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాంటి దే ఓ మెస్సేజ్ వాట్సాప్‌లో బాగా సర్క్యులేట్ అవుతోంది. భారత్‌లో త్వరలోనే కరోనా మూడో వేవ్ రావచ్చని ప్రధాని సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్ చెప్పిన తర్వాత ఈ థర్డ్ వేవ్‌ కేంద్రంగా మెస్సేజులు బాగా పెరిగాయి. వాటిలో చాలా వరకూ తప్పుడు మెస్సేజులే ఉంటాయి.
తాజాగా అలాంటిదే ఓ ఫేక్ మెస్సేజ్ బాగా సర్క్యులేట్ అవుతోంది. వచ్చే 72 గంటలు భారత దేశానికి చాలా ప్రమాదకరమని WHO ICMR భారతదేశాన్ని హెచ్చరించిందన్నది ఆ మెస్సేజ్ సారాంశం. అంతే కాదు.. వచ్చే 78 గంటల్లో భారతదేశంలో ధర్డ్ వేవ్ ప్రారంభం అవుతోందని.. WHO ICMR తెలిపిందట. భారతదేశం మూడో దశకు వెళితే రోజూ  50, 000 మంది చనిపోతారట. భారతదేశ జనాభా సాంద్రత ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ కావడమే ఇందుకు కారణమట.
భారత్‌లో ధర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే జనం  72 నుండి 108 గంటలు అస్సలు బయటకు రాకూడదట. నగరాల్లో ఆసుపత్రిలో చోటు లేదని.. డబ్బు కూడా అస్సలు పనిచేయడం లేదని.. ఏకైక పరిష్కారం మిమ్మల్ని మీరు మాత్రమే రక్షించుకోవడం అంటూ ఈ ఫేక్ మెస్సేజ్‌లో ఊదరగొడుతున్నారు. అయితే ఇది ఓ ఫేక్ మెస్సేజ్.. ఎందుకంటే అసలు  WHO ICMR అనే సంస్థ లేదు.. WHO వేరు.. ICMR వేరు.. ఈ ఫేక్ మెస్సేజ్ తయారు చేసిన వాడు ఈ రెండింటి పేర్లూ వాడేసుకున్నాడు.
అంతే కాదు.. ధర్డ్ వేవ్‌ అనేది ముహూర్తం చూసుకున్నట్టుగా 72 గంటల్లోనే.. 108 గంటల్లోనో రాదు.. మరో కీలక విషయం.. ధర్డ్ వేవ్ వచ్చిందంటే.. కేవలం ఇంట్లో కూర్చున్నంత మాత్రాన దాని నుంచి కాపాడుకుంటాం అనేది వట్టి మాట.. అది కూడా కేవలం ఓ 72 గంటలు ఇంట్లో ఉంటే ధర్డ్ వేవ్ నుంచి కాపాడుకోవడం ఇంకా వట్టి మాట. అందుకే ఇలాంటి ఫార్వార్డ్ మెస్సేజులు చూసి బెంబేలెత్తిపోకండి.. అలాగనే వీటిని ఫార్వార్డ్ చేసి జనంలో భయం మరింత పెంచకండి. జాగ్రత్త.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: