తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు ఒకే సమయంలో కెరీర్ ప్రారంభించారు. రజినీ తన స్టైల్ తో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ కాగా, కమల్ హాసన్ వివిధ ప్రయోగాత్మక పాత్రల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో కమల్ హాసన్ పూర్తి స్థాయిలో సినిమా పక్కన బెట్టి రాజకీయాల్లోకి వెళ్లబోతున్నానని..తన చివరి సినిమా భారతీయుడు2 అని ఆ మద్య ఓ సందర్భంలో తెలిపారు.
మరోవైపు రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో ‘దర్భార్’సినిమా రూపొందుతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా నిన్న రిలీజ్ అయ్యింది. కొన్నిరోజుల క్రితం కమలహాసన్ మాట్లాడుతూ తన మిత్రుడైన రజనీకాంత్ ఎన్నికల్లో మద్దతు ఇస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి రుజువు అన్నట్లు ఇటీవల కమల్ ఆఫీస్ కి రజినీకాంత్ వెళ్లడం..చాలా సేపు ముచ్చటించడం కూడా జరిగింది. తాజాగా కమల్ ఆశలపై రజినీ నీళ్లు జల్లినట్లు వార్తలు వస్తున్నాయి.
కమలహాసన్ కి రజనీకాంత్ నిర్మొహమాటంగా మద్దతు ఇవ్వడం లేదంటూ చెప్పేశారు. అంతేకాదు, ఈ అంశాన్ని పెద్దది చేసి చూడడం ద్వారా తామిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న నదుల అనుసంధానం అంశం తనను ఆకట్టుకుందని రజనీ తెలిపారు. అయితే తన మద్దతు ఎవరికో మాత్రం చెప్పలేదు.