తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న అందాల భామ సొనాలీ బింద్రే. గత కొన్ని రోజుల నుంచి ఈ అందాల భామ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలసిందే. తాజాగా మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అమ్మాయిలను కిడ్నాప్ చేయాలని యువకులకు పిలుపునిచ్చి వార్తల్లోకి ఎక్కిన ఆయన తాజాగా మరోమారు చిక్కుల్లో పడ్డారు. నటి సోనాలీ బింద్రే క్యాన్సర్ తో కన్నుమూసిందని..ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.
అయితే ఈ విషయాన్ని ఆయనకు తన వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్ ని స్క్రీన్ షాట్ తీసి మరీ ట్విట్టర్ లో షేర్ చేశారు. అది చూసి నెటిజన్లు, సెలబ్రెటీలు షాక్ తిన్నారు. ఎమ్మెల్యేకు వచ్చిన వాట్సాప్ మెసేజ్లో.. ‘హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన నటి సోనాలి బింద్రే ఇక లేరు. మనందరికీ ప్రియమైన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం’ అని రాసుంది.
రామ్ కదమ్.. ఆ మెసేజ్లోని సమాచారాన్ని నిర్ధారించుకోకుండా యథాతథంగా ట్విట్టర్లో షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడడంతో ఎమ్మెల్యే స్పందించారు. ట్వీట్ను డిలీట్ చేసి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశారు. వెంటనే సోనాలి గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆమె త్వరగా కోలుకోవాలని, తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని భగవంతుడిని వేడుకుంటున్నా అని పేర్కొన్నారు.