టాలీవుడ్ లో ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వస్తున్నారు. అయితే ఎవరూ ఎవరికి పోటీ కాకుండా తమ సొంత టాలెంట్ తో మెగా హీరోలుగా చెలామణి అవుతున్నారు. తాజాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగి పోతున్నాడు. అవును మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుంచో కంటున్న కలలు ఆయన తనయుడు రాంచరణ్ నిజం చేయబోతున్నాడు.
చిరంజీవి చాలా కాలం క్రితం ఊహల్లో నిర్మించుకున్న మెగాసౌధానికి, రూపం ఇవ్వబోతున్నాడట రామ్ చరణ్. ఇప్పటి వరకు స్టార్ హీరోలు హైదరాబాద్ లో తమకంటూ సొంత స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ తమ సొంత స్టూడియోలు ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి చాలా కాలంగా ప్రయత్నిస్తోన్న మెగా స్టూడియో నిర్మాణానికి పునాది వేస్తున్నాడట 'మగధీరు'డు. హైదరాబాద్, కోకాపేటలో మెగాఫ్యామిలీకి ఉన్న 22ఎకరాల భూమిలో ఫిల్మ్ స్టూడియో కట్టాలనుకుంటున్నాడట చెర్రీ.
ఇప్పటికే ఆర్కిటెక్చర్స్తో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే భూమి పూజ కూడా చేస్తారని వినిపిస్తోంది. రామ్ చరణ్ మెగా స్టూడియో కట్టాలనుకుంటోన్న చోట ప్రస్తుతం 'సైరా' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం రాంచరణ్ భారీ బడ్జెట్ దాదాపు నలభై కోట్లు వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. ఆ మద్య చిరంజీవి విశాఖపట్నంలో ఓ ఫిల్మ్ స్టూడియో కట్టబోతున్నాడని చాలా ఏళ్లనుంచి వార్తలొస్తున్నాయి.
సముద్రపు ఒడ్డున చిరు స్థలం కూడా కొన్నాడనే ప్రచారం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు దానికి ఎలాంటి కార్యరూపం దాల్చలేదు. తాజాగా రామ్ చరణ్ హైదరాబాద్లో స్టూడియో కట్టి చిరు కలను సాకారం చెయ్యబోతున్నాడని చెప్పొచ్చు. ఇప్పుడు మెగాస్టూడియో నిర్మాణం అయితే మాత్రం ఇండస్ట్రీలో మరో సెన్సేషన్ క్రియేట్ అవుతుందని అభిమానులు తెగ సంబరపడి పోతున్నారు.