ఆడియన్ ఎల్లప్పుడూ వినోదాన్ని కోరుకుంటాడు...
వినోదానికి అప్సన్స్ మనకు చాలానే దొరుకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకి రావాలంటే.. సినిమాల్లో కొత్తదనాన్ని చూపించాల్సిందే.. అంటున్నారు నిర్మాత ఎస్.కె.ఎన్. ‘ఈరోజుల్లో’తో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన ఇటీవల ‘టాక్సీవాలా’తో మరో విజయాన్ని అందుకొన్నారు. ఆదివారం ఎస్.కె.ఎన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన శనివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
దాదాపు పదిహేనేళ్లకు పైగా చిత్రసీమతో నా అనుబంధం కొనసాగుతోంది. చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి అభిమానిని. నా వ్యక్తిత్వం, పని నచ్చి నన్ను పీఆర్వోగా నియమించుకొన్నారు అల్లు అర్జున్. ఆయన అండతోనే దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాసు, నేను కలిసి తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని చిత్రాల్ని పంపిణీ చేశాం.
మారుతిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తక్కువ బడ్జెట్లో ‘ఈరోజుల్లో’ని నిర్మించి విజయాన్ని అందుకున్నా. నిర్మాతలకి అసలు సవాల్ కథలు ఎంపిక చేసుకోవడంలోనే ఉంటుంది. వైవిధ్యమైన కథలను కమర్షియల్ హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం నాకు ఇష్టం...
టాక్సీవాలా’ తర్వాత చాలా కథలు విన్నా. కొత్త కథల కోసం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నా. ప్రస్తుతం రెండు కథలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి.
వాటితో ఇద్దరు కొత్త దర్శకుల్ని చిత్ర సీమకు పరిచయం చేస్తున్నా. ప్రస్తుతం మారుతి - సాయిధరమ్ తేజ్ కలయికలో వస్తున్న ‘ప్రతిరోజు పండగే’కు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నా. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమా నిర్మాణంపైనే ఉంది. తెలుగులో కొత్త ఆలోచనలతో, సరికొత్త కథలు తీసుకొస్తున్న దర్శకులు చాలా మందే కనిపిస్తున్నారు.