"నువ్వు నాకు నచ్చావ్" పింకీ ఒక్క సినిమాకే చాలా క్రేజ్ తెచ్చుకుంది కానీ?
కొన్ని సినిమాలలో హీరో హీరోయిన్లకు మించి కమెడియన్లు, చైల్డ్ ఆర్టిస్ట్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆ సినిమా చూడగానే ముందుగా వారి పేరు గుర్తుకు రావాల్సిందే. అంతగా ఆ పాత్రతో మనకు కనెక్ట్ అయిపోతారు. ఆ పాత్రను అంత చక్కగా రూపుదిద్దడంలో దర్శకుడు ప్రతిభ ఉంటుంది. అలాగే అనుకున్న ఫలితం రావాలంటే మాత్రం ఆ నటి కూడా అంతే పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఆ పాత్ర నేరుగా ప్రజల మనసుల్లో వెళ్లి ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరదు. ఇదే తరహాలో పింకీ సుదీప కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకుంది. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో మన ముందుకు వచ్చిన "నువ్వు నాకు నచ్చావ్" సినిమా ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే.
ఈ సినిమా మొత్తం ప్రేక్షకుల్ని గుక్క తిప్పుకోనీకుండా కడుపుబ్బ నవ్వించడంలో బాగా సక్సెస్ అయ్యారు దర్శకుడు కె విజయ భాస్కర్. ఈ చిత్రంతో సూపర్ హిట్ అవ్వడంతో స్వర్గీయ నటి ఆర్తి అగర్వాల్ కి కూడా కెరియర్ లో స్పీడ్ పెరిగింది. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన పింకీ సుదీప కు కూడా చాలా మంచి పేరు వచ్చింది. పింకీ దిస్ ఇస్ వెంకీ అంటూ ఈ సినిమాలో పింకీ చేసిన కామెడీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. హాస్య బ్రహ్మ బ్రహ్మానందంపై కూడా పంచ్ లు వేసి ప్రేక్షకుల్ని పడి పడి నవ్వుల చేసింది ఈ చైల్డ్ ఆర్టిస్ట్. వెంకీ, బ్రహ్మానందం మరియు పింకీ ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.
"నువ్వు నాకు నచ్చావ్" సినిమా అంటే చాలు పింకీ డైలాగ్స్ గుర్తుకు రావాల్సిందే అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది పింకీ. దాదాపు 20 చిత్రాలకు పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది పింకీ సుదీప. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది. అనంతరం తిరిగి మళ్ళీ కెరియర్ ని ప్రారంభించింది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందకపోవడంతో శ్రీ రంగనాథ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ అలాగే బుల్లితెరపై "ప్రతిఘటన" ధారావాహికలో ప్రముఖ పాత్రలో కనిపించింది. అయితే ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు పింకీ. ప్రస్తుతం పింకీ సుదీప ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ఉంటుంది అంటూ సమాచారం.