సీఎం జగన్ పై జయప్రద సంచలన వ్యాఖ్యలు..అందుకేనా?
భారతీయ చలన చిత్ర రంగంలో 80వ దశకంలో అందాల తార తనదైన ముద్ర వేశారు జయప్రద. అందం.. అభినయం..నాట్యం ఆమె సొంతం. తెలుగు లో టాప్ హీరోయిన్ గా చెలామని అయిన జయప్రద తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే సమయంలో శ్రీదేవి సైతం బాలీవుడ్ లో దుమ్మురేపారు. ఈ ఇద్దరు హీరోయిన్లు తెలుగులో నెంబర్ వన్ రేస్ లో ఉండగానే బాలీవుడ్ పయణం అయ్యారు. అయితే శ్రీదేవి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. ఇదే సమయంలో జయప్రద రాజకీయాల్లో వెళ్లారు. ఆ మద్య మళ్లీ వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలుగు లో మంచి ఛాన్సు, నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో తప్పకుండా నటిస్తానని చెప్పారు. ఓ వైపు రాజకీయాల్లో చురుకుగా ఉంటున్న ఆమె ఎంపీగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఏపిలో మూడు రాజధాని విషయాల్లో పెద్ద యుద్దమే జరుగుతుంది. పరిపాలన సౌలభ్యం... రాష్ట్రాభివృద్ది కోసం మూడు రాజధానుల చేస్తే బాగుంటుందని ఇటీవల సీఎం జగన్ వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు రాజధాని కోసం తమ భూములు ఇచ్చాం.. రాజధాని అమరావతిలోనే ఉండాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తున్నారు. కాగా, ఏపీ రాజధాని విషయంలో ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు అని చాలా వరకూ విమర్శలు వస్తున్నాయి.
తాజాగా నటి, రాజకీయ నాయకురాలు జయప్రద ఏపి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో ప్రజల ఇష్టానుసారమే నిర్ణయాలు ఉండాలని నటి జయప్రద అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు తనకు నచ్చడం లేదని వ్యాఖ్యానించారు. తాను ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై స్పందించడం అవసరమని జయప్రద అన్నారు. జగన్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటే మంచిదని జయప్రద అన్నారు.