పల్లెటూరి నేపథ్యంలో.. 'విజయ్ దేవరకొండ' !
నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో ఓ చిన్న రోల్ తో ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. వినూత్న సినిమాగా వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' విజయ్ దేవరకొండ సినీ కెరీర్ కి పునాది అయింది. ఆ తర్వాత 'పెళ్లి చూపులు' 'అర్జున్ రెడ్డి'.. చిన్న సినిమాలుగా రిలీజ్ అయి, ఎవరూ ఊహించని విధంగా సంచలనాత్మక విజయాలనే అందుకున్నాయి . ఆ విజయాలకి తగ్గట్లుగానే ఆ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అనిపించుకున్నాడు. పైగా ఆ స్టార్ స్టేటస్ ను ఈ హీరో ఓ రేంజ్ కి తీసుకువెళ్లగలిగాడు. అందుకే పూరి లాంటి దర్శకుడు కూడా విజయ్ దేవరకొండతో సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం స్టార్ డైరెక్టర్స్ తో పాటు యంగ్ డైరెక్టర్లకు కూడా ఛాన్స్ లు ఇస్తున్నాడు. యువ దర్శకుడు శ్రీ హర్ష కోనుగంటి యూత్ ను టార్గెట్ చేసుకుని తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'హుషారు' బీసీ సెంటర్లలో మంచి రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబట్టి మొత్తానికి హిట్ సినిమాగా నిలిచింది. దాంతో ఈ యంగ్ డైరెక్టర్ కి బాగానే అవకాశాలు వచ్చాయి. వాటిల్లో ముఖ్యంగా 'విజయ్ దేవరకొండ'తో సినిమా చేసే అవకాశాన్ని అందుకోవడం. అయితే మొదట శ్రీ హర్ష చెప్పిన కథ విజయ్ కి నచ్చలేదు. దాంతో సినిమా ఆగిపోయింది. అయితే ఇటీవలే శ్రీ హర్ష, విజయ్ దేవరకొండకి తన కొత్త కథను వినిపించాడు. ఆ కథ విజయ్ కి బాగా నచ్చిందట.
దాంతో విజయ్ దేవరకొండ సినిమా చెయ్యడానికి అంగీకరించాడట. కాకపోతే వచ్చే ఏడాది వరకూ హర్ష ఆగాల్సిందే. వచ్చే మార్చిలో ఈ సినిమా మొదలవ్వనుందని తెలుస్తోంది. ఫారెన్ లో పెరిగిన ఓ యువకుడు మారుమూల పల్లెటూరులో బతకాల్సి వస్తోందట. ఆ క్రమంలో హీరో ఎదురుకునే సమస్యలు, సంఘటనలు చాల ఆసక్తికరంగా ఉంటాయట. మొత్తానికి తన రెండో చిత్రాన్నే ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోతో చెయ్యడం.. అది 20 కోట్లుగా పైగా బడ్జెక్ట్ ఉన్న సినిమాకి డైరెక్షన్ చేసే ఛాన్స్ రావడం, నిజంగా శ్రీ హర్షకి ఇది బంపర్ ఆఫరే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి చిత్రంతో, అదేవిధంగా దర్శకుడు క్రాంతి మాధవ్ సినిమాతో బిజీ బిజీగా వున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక శ్రీ హర్ష కోనుగంటి సినిమా మొదలవుతుందట. మరి మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ రెండో సినిమాతో కూడా సక్సెస్ కొడతాడా..? అయితే స్క్రిప్ట్ మాత్రం బాగా వచ్చిందని తెలుస్తోంది.